US Road Accident: అగ్రరాజ్యం అమెరికాలోని సౌత్ కరోలినాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో భారతదేశానికి చెందిన ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు. మృతులను గుజరాత్ రాష్ట్రంలోని ఆనంద్ జిల్లాకు చెందిన రేఖాబెన్ పటేల్, సంగీతాబెన్ పటేల్, మనీషాబెన్ పటేల్ లుగా గుర్తించారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. వీరు ఓ ఎస్యూవీ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఓ వంతెన పైన అధిక వేగంతో ప్రయాణించడం వల్ల వాహనం అదుపు తప్పింది. పల్టీలు కొడుతూ అన్నీ లైన్లను దాటుకుంటూ ఓ చెట్టుపై ఎగిరిపడింది. అక్కడ ఇరుక్కుపోయింది. ఆ సమయంలో వాహనం గాల్లోకి 20 అడుగుల మేరకు లేచినట్లుగా తెలుస్తోంది.
సమాచారం అందుకున్న వెంటనే సౌత్ కరోలినా హైవే పెట్రోల్, గాంట్ ఫైర్ అండ్ రెస్క్యూ మరియు బహుళ గ్రీన్విల్లే కౌంటీ EMS యూనిట్లతో సహా అత్యవసర ప్రతిస్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంలో కారు ముక్కలైందని, ఓ చెట్టుపై దీన్ని గుర్తించినట్లు చీఫ్ డిప్యూటీ కరోనర్ మైక్ ఎల్లిస్ తెలిపారు.
కాగా.. ప్రమాదం గురించి వాహనం యొక్క డిటెక్షన్ సిస్టమ్ కుటుంబ సభ్యులను అప్రమత్తం చేసింది, వారు వెంటనే సౌత్ కరోలినాలోని స్థానిక అధికారులను అలర్ట్ చేశారు.