CM Revanth Reddy : తెలంగాణ రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదం వల్లే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. మంగళవారం ఇక్కడ సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో ఏర్పాటు చేసిన సభలో ‘మహాలక్ష్మి స్వశక్తి మహిళ’ అనే పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించారు.
Read Also : KCR : కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయి, సమైక్య పాలకులే నయం, నేను గెలిచుంటే దేశంలో అగ్గి రాజేసేవాడిని- కేసీఆర్
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మాట తప్పకుండా, మడమ తిప్పకుండా సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చారు. ప్రత్యేక రాష్ట్రం ఇస్తే.. ఏపీలో పార్టీకి తీవ్ర నష్టమని తెలిసినా మనకు రాష్ట్రం ఇచ్చారు. కేసీఆర్ పదేళ్లపాటు మహిళలు, ఆడబిడ్డలను పట్టించుకోలేదు. మహిళల ఉసురు తగిలి కేసీఆర్ పదవి పోయింది.
మళ్లీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం :
మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తే.. కేసీఆర్ కుటుంబానికి కడుపుమంటగా ఉంది. ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం వద్దంటూ ఆటో డ్రైవర్లతో ధర్నా చేయిస్తున్నారు. పేదలకు కార్పొరేట్ వైద్యం అందించే రాజీవ్ ఆరోగ్యశ్రీని కేసీఆర్ నిర్వీర్యం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ పథకాన్ని 10లక్షలకు పెంచాం. కేసీఆర్, మోదీ కలిసి 400 ఉన్న గ్యాస్ సిలెండర్ను 1200 చేశారు. మహిళలకు భారం కావొద్దని మళ్లీ 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తానని కేసీఆర్ పదేళ్లు డబ్బా కొట్టారు.
కేసీఆర్, మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారు :
పదేళ్లలో ఎంతమందికి ఇళ్లు ఇచ్చారో చెప్పాలి. మహిళా సంఘాల కోసం ప్రత్యేకంగా 100 మార్కెట్లు నిర్మించి, వారి ఉత్పత్తుల విక్రయం కోసం స్టాళ్లు ఏర్పాటు చేయిస్తాం. సీఎం కుర్చీలో పాలమూరు బిడ్డ కూర్చుంటే కొందరికి కడుపు మండుతోంది. మహిళలు గెలిపించిన ప్రభుత్వాన్ని కూలగొట్టాలని కేసీఆర్, మోదీ కలిసి కుట్రలు చేస్తున్నారు’ అని సీఎం రేవంత్ విమర్శించారు.
రైతుల పంటలు కొనని నరేంద్ర మోదీకి ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. ఏటా రెండు కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామని మోదీ చెప్పారని, సోనియాగాంధీ పార్లమెంట్ తలుపులు మూసివేసి తెలంగాణ ఇచ్చారని మోదీ విమర్శించారని అన్నారు. తెలంగాణ ఏర్పాటును మోదీ ఎన్నోసార్లు అవమానించారని రేవంత్ మండిపడ్డారు.