YS Jaganmohan Reddy : దావోస్ పర్యటన ముగించుకొని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మంగళవారం రాష్ట్రానికి తిరిగి వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టులో సీఎస్ సమీర్శర్మ, డీజీపీ కే.వీ. రాజేంద్రనాథ్ రెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త ఎమ్మెల్సీ తలశిల రఘురాం,గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్సీ రుహుల్లా, ఎమ్మెల్యేలు వెలంపల్లి శ్రీనివాస్, వల్లభనేని వంశీ, కైలే అనిల్ కుమార్, మల్లాది విష్ణు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు ఆయనకు స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్ సదస్సు లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు పలువురు మంత్రులు పాల్గొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి.
అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని సమతుల్యం చేసుకుంటూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా నిలిపేందుకు సీఎం జగన్ నేతృత్వంలో రాష్ట్రం దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించింది. రేపటి ప్రపంచంతో పోటీపడుతూ, సుస్థిర ఆర్థికాభివృద్ధి లక్ష్యాలను సాధించేందుకు ఈ వేదికను చక్కగా వినియోగించుకుంది. విఖ్యాత సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు రాష్ట్రంతో అవగాహన కుదుర్చుకున్నారు.