Bro Movie Controversy
Director Trivikram Srinivas: బ్రో మూవీ (Bro Movie)లో శ్యాంబాబు డ్యాన్స్ ఏపీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu)కు ఆగ్రహం తెప్పించింది. సంక్రాంతి సంబరాల్లో మంత్రి అంబటి చేసిన డ్యాన్స్ను ఇమిటేట్ చేస్తూ హాస్యనటుడు ఫృద్విరాజ్తో డ్యాన్స్ చేయించారని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. బ్రో హీరో పవన్తో రాజకీయంగా వైసీపీకి ఇప్పటికే వైరం ఉండగా, ఇప్పుడు ఆ సినిమా మాటల రచయిత త్రివిక్రమ్ కూడా వైసీపీకి టార్గెట్ అయ్యారు. మంత్రి అంబటి మీడియా సమావేశం పెట్టి మరీ త్రివిక్రమ్కు స్ట్రాంగ్ వార్నింగ్ (Strong Warning) ఇచ్చారు. వైసీపీ, జనసేన (Janasena) రాజకీయ యుద్ధంలో మాటల మాంత్రికుడు చిక్కుకోవడం సినీ వర్గాల్లో హాట్టాపిక్గా మారగా.. త్రివిక్రమ్ మరో సినిమా గుంటూరు కారం (Guntur Kaaram)పై ఈ ఎఫెక్ట్ ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
ఏపీలో బ్రో సినిమా అగ్గి రాజేస్తోంది. ముఖ్యంగా ఆ సినిమాలో శ్యాంబాబు డ్యాన్స్ అధికార పార్టీకి ఆగ్రహం తెప్పించింది. ఇప్పటికే తెలుగు సినీ పరిశ్రమపై కోపంగా ఉన్న వైసీపీ సర్కార్.. తాజా వివాదంతో మరింత రగిలిపోతోందని అంటున్నారు పరిశీలకులు. బ్రో హీరో పవన్తో రాజకీయంగా వైసీపీకి వైరం ఉంది. ప్రత్యర్థి పార్టీలుగా సీఎం జగన్, జనసేనాని పవన్ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా, ఇప్పుడు బ్రో సినిమా ద్వారా ఈ యద్ధం మరో టర్న్ తీసుకుంది. ముఖ్యంగా మంత్రి అంబటిని అవమానపరిచేలా సంభాషణలు ఉన్నాయని.. మాటల రచయిత త్రివిక్రమ్పై కన్నెర్ర చేస్తున్నారు మంత్రి అంబటి రాంబాబు.
త్రివిక్రమ్ను టార్గెట్ చేసిన మంత్రి అంబటి.. ఆయన సినిమాలు ఎలా ఆడతాయో చూస్తానని వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు తాము కూడా మరో సినిమా తీస్తామని ప్రకటించారు. ఆ సినిమాకు త్రివిక్రమ్ను మించిన రచయితతో సంభాషణలు రాయిస్తామన్నారు. ఐతే ఇదంతా రాజకీయంగా చూసినా.. త్రివిక్రమ్ సినిమాలు ఎలా ఆడతాయో చూస్తామని వార్నింగ్ ఇవ్వడమే ఇప్పుడు వాడివేడి చర్చకు దారితీస్తోంది. త్వరలో త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన గుంటూరు కారం సినిమా రిలీజ్ కాబోతోంది. మంత్రి వార్నింగ్ గుంటూరు కారం సినిమా కలెక్షన్లపై ఎఫెక్ట్ చూపుతుందా? అనేది హాట్టాపిక్గా మారింది.
సాధారణంగా రిలీజ్ సమయంలో టిక్కెట్ రేట్లు పెంచుకుంటుంటారు. ఐతే ఇలా రేట్లు పెంచుకోడానికి ప్రభుత్వ ముందస్తు అనుమతి ఉండాలి. గతంలో ఏపీ ప్రభుత్వానికి.. చిత్రపరిశ్రమకు మధ్య ఉన్న గ్యాప్ వల్ల ధరల పెంపును అంగీకరించలేదు జగన్ సర్కార్. సినీ పెద్దలు సీఎంను కలిసి పరిస్థితులు వివరించడంతో ఆ తర్వాత కొన్ని సడలింపులు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ శ్యాంబాబు వివాదంతో పాత కథ పునరావృతమవుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది.
Also Read: పవన్ రెమ్యునరేషన్, బ్రో బడ్జెట్ పై వస్తున్న విమర్శలకు నిర్మాత గట్టి కౌంటర్..
బ్రో ఎఫెక్ట్తో గుంటూరు కారంపై టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఆంక్షలు విధిస్తే భారీ నష్టాలు ఎదుర్కోక తప్పదు. డైరెక్టర్ త్రివిక్రమ్పై కోపంతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తే పరిస్థితి ఏంటనేది చిత్రపరిశ్రమలో చర్చనీయాంశమవుతోంది. ముఖ్యంగా గుంటూరు కారం కథానాయకుడు మహేశ్ ఎలా స్పందిస్తారనేది కూడా ఆసక్తి రేపుతోంది. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మహేశ్కు.. సీఎం జగన్తో మంచి సంబంధాలే ఉన్నాయి. కానీ, త్రివిక్రమ్ రూపంలో ఇప్పుడు కొత్త వివాదం రాజుకోవడమే చర్చకు దారితీస్తోంది. త్రివిక్రమ్ను లక్ష్యంగా చేసుకున్న ప్రభుత్వం.. వ్యక్తిగతంగా ఆయనపై వ్యంగ్య సినిమా తీస్తుందా? లేక ఆయన డైరెక్షన్ చేసే ప్రతి సినిమాను కట్టడి చేయడానికి చూస్తుందా? అనేది తెలుగు రాష్ట్రాల్లో హాట్టాపిక్గా మారింది.