Fibernet scam : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు చుట్టూ పిటీషన్ల ఉచ్చు బిగుస్తోంది. సీఐడీ అధికారులు వరుసగా ఏసీబీ కోర్టులో పీటీ వారెంట్లు వేస్తున్నారు. ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును సీఐడీ అధికారులు అరెస్టు చేసిన విషయం విధితమే. ప్రస్తుతం చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్లో ఉన్నారు. స్కిల్ కేసుకుతోడు ఇప్పటికే విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబుపై ఇన్నర్ రింగ్ రోడ్డుపై పిటీ వారెంట్ వేసిన సీఐడీ అధికారులు.. తాజాగా మరో కేసులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ప్రధాన ముద్దాయిగా ఏసీబీ కోర్టులో ఏపీ సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేసింది. ఈ పిటీషన్ను ఏసీబీ కోర్టు విచారణకు స్వీకరించింది. టెర్రా సాప్ట్ కంపెనీకి అక్రమంగా టెండర్లు ఇచ్చారని సీఐడీ పేర్కొంది.
టెర్రా సాప్ట్కు అక్రమ మార్గంలో టెండర్లు ఇవ్వడంపై సీఐడీ విచారణ జరిపింది. నిబంధనలకు విరుద్ధంగా టెండర్ గడువు వారం రోజులు పొడిగించినట్లు సీఐడీ అధికారులు గుర్తించారు, అయితే, బ్లాక్ లిస్ట్లో ఉన్న టెర్రా సాప్ట్కు టెండర్ దక్కేలా వేమూరి చక్రం తిప్పారని ఆరోపణలు ఉన్నాయి. వేమూరి హరిప్రసాద్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని, దీంతో ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు పాత్ర ఉందని సీఐడీ భావిస్తుంది. అంతకుముందే.. 2019లో ఫైబర్ నెట్ స్కాంపై 19 మందిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఏ1గా వేమూరి హరిప్రసాద్, ఏ2 మాజీ ఎండీ సాంబశివరావుగా సీఐడీ పేర్కొంది. ఫైబర్ నెట్ ఫేజ్-1లో రూ. 320 కోట్లకు టెండర్లు వేయగా కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, టెర్రా సాప్ట్కు కట్టబెట్టేందుకు అవకతవకలు జరిగినట్లు సీఐడీ అధికారులు పేర్కొంటున్నారు.
Read Also: Posani Krishna Murali: బ్రాహ్మణికి పోసాని నాలుగు ప్రశ్నలు.. వాటికి సమాధానం చెబితే నీ కాళ్లకు దండం పెడతా
మరోవైపు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును విచారణ నిమిత్తం తమ కస్టడీకి ఇవ్వాలని విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు పిటిషన్ దాఖలుచేశారు. ఈ పిటీషన్తో పాటు చంద్రబాబుకు బెయిల్, మధ్యంతర బెయిల్ పిటీషన్లపై ఏసీబీ కోర్టు మంగళవారం విచారణ జరిపింది. అయితే, ఈ మూడు పిటిషన్లపై విచారణను ఏసీబీ కోర్టు వాయిదా వేసింది. హైకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ దృష్ట్యా అన్ని పిటిషన్ల పైన ఏసీబీ కోర్టు విచారణ వాయిదా వేసింది.