శ్రీవారి లడ్డూకి పూర్వవైభవం తీసుకొస్తాం.. త్వరలోనే హోటల్స్కు కొత్త పాలసీ.. : టీటీడీ ఈవో శ్యామలరావు
టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలపై ప్రస్తావించారు.
- Harishth Thanniru
- Published On : July 20, 2024 / 02:20 PM IST
TTD EO Shyamala Rao
TTD EO Syamala Rao : టీటీడీ ఈవోగా శ్యామలరావు బాధ్యతలు చేపట్టి నెలరోజులు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలపై ప్రస్తావించారు. టీటీడీకి ఈవోగా పంపుతూ తిరుమలలో చాలా లోపాలు ఉన్నాయని సీఎం చంద్రబాబు చెప్పారు. గత నెల రోజులుగా తిరుమలలో తనిఖీలు నిర్వహించి అనేక లోపాలు ఉన్నాయని గుర్తించాం. అన్న ప్రసాదాలు, లడ్డు ప్రసాదం క్వాలిటీ లేదు. తిరుమల లడ్డూ పేటెంట్ హక్కులు ఉన్నాయి అందుకు తగినట్లుగా లడ్డు క్వాలిటీ లేదు. దర్శనం టికెట్లు జారీలో వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. తిరుమల పవిత్రత కాపాడే విధంగా కార్యక్రమాలు ఉండాలని సీఎం చెప్పారు. క్యూలైన్లో తనిఖీలో అన్నప్రసాదాలు, పాలు అందలేదు అనే ఫిర్యాదులు వచ్చాయి. సమస్య చెప్పుకోవడానికి ఎవరూ లేరన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. భక్తుల సూచన మేరకు క్యూలైన్ల పర్యవేక్షణకు ప్రత్యేకంగా ఏఈఓ లను నియమించామని శ్యామలరావు అన్నారు.
Also Read : రాజకీయాలకు NTR ఒక బ్రాండ్.. ఎంతోమందికి అవకాశాలు ఇచ్చారు: కమ్మ గ్లోబల్ సమ్మిట్లో సీఎం రేవంత్
అన్నప్రసాదంలో నాణ్యత పెంపుకు అవసరమైన చర్యలు తీసుకున్నాం. తాజాగా క్యూ లైన్లో మూడు చోట్లా అన్నప్రసాదాలు వితరణ కేంద్రాలు పెట్టామని ఈవో శ్యామలరావు చెప్పారు. రాబోయే 25-30 సంవత్సరాలు దృష్టిలో ఉంచుకొని ఆన్న ప్రసాదంలో మార్పులు చేయాలి. లడ్డూ నాణ్యత పెంపుకోసం నాణ్యమైన నెయ్యి, ఇతర ముడి సరుకులు నాణ్యమైనవి కలిగినవి కొనుగోలు చేయాలి. అన్న ప్రసాదం మరింత నాణ్యత పెంపుకు నిపుణులతో చర్చిస్తున్నాం. శ్రీవారి లడ్డూకి పూర్వ వైభవం తీసుకొస్తామని ఈఓ శ్యామలరావు అన్నారు. తిరుమలలో ఆహార పదార్థాలు నాణ్యతను పరిశీలించడానికి ఎఫ్ఎస్ఎస్ఐ ల్యాబ్ ఏర్పాటుకు ముందుకు వచ్చారు. ఎఫ్ఎస్ఎస్ఐ మొబైల్ ల్యాబ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.
టీటీడీకి అవసరమైన నిత్యవసరాలు, లడ్డు తయారీ ముడి సరుకులు క్వాలిటీలో రాజీ లేకుండా కొనుగోళ్లు చేస్తాం. తిరుమలలోని రెస్టారెంట్లలో మంచి ఆహారం దొరకడం లేదు. రేట్లు టీటీడీ కంట్రోల్ లో లేవు. క్వాలిటీ పర్యవేక్షణ లేదు. త్వరలోనే హోటల్స్ కు కొత్త పాలసీ తీసుకొస్తాం. ఆన్ లైన్లో సేవ టికెట్లు, దర్శనం టికెట్లకు ఆధార్ అనుసంధానం తప్పనిసరి చేస్తామని చెప్పారు. దర్శనం టికెట్లకు ఆధార్ ను అనుసంధానం చేయడం వలన అక్రమాలు అరికట్టవచ్చు అని టీటీడీ ఈఓ శ్యామలరావు చెప్పారు.
