Heavy Rain : ఏపీలో భారీ వర్షాలు.. ఆ రెండు జిల్లాల్లో రెడ్అలర్ట్.. పాఠశాలలు, కాలేజీలకు సెలవు
ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యలకోసం మూడు ఎస్టీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని
- Harishth Thanniru
- Published On : July 20, 2024 / 08:02 AM IST
Weather Update
Heavy Rain In AP : ఏపీలోని పలు జిల్లాల్లో ఇవాళ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. మరోవైపు వాయుగుండం వాయవ్య దిశగా పయనించి ఈరోజు పూరీ సమీపంలో తీరందాటే అవకాశం ఉందని, తీరం దాటిన తర్వాత వాయుగుండం క్రమంగా బలహీన పడుతుందని వాతావరణం శాఖ తెలిపింది. ఈ ప్రభావంతో ఇవాళ అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది.
Also Read : Bunny Vasu : జనసేన ఎమ్మెల్యే టికెట్ ఆఫర్ చేస్తే నో చెప్పిన నిర్మాత.. కానీ వచ్చే ఎన్నికల్లో..
వాయుగుండం తీరే దాటే క్రమంలో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. అక్కడక్కడా పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. అలాగే కాకినాడ, కోనసీమ అంబేద్కర్ జిల్లా, ఉభయ గోదావరి జిల్లాలు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. వీటితో పాటు బాపట్ల, పల్నాడు, గుంటూరు, నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, వైఎస్ఆర్ జిల్లా, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Also Read : 22 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. ఆ అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం..!
ఏపీలో భారీ వర్షాలు నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అత్యవసర చర్యలకోసం మూడు ఎస్టీఆర్ఎఫ్, రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. వాగులు, కాలువలు దాటే ప్రయత్నం చేయొద్దని ప్రజలకు అధికారులు సూచిస్తున్నారు. అలాగే లోతట్టు ప్రాంతాల ప్రజలు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు భారీ వర్షాల నేపథ్యంలో విశాఖపట్నం, కళింగపట్నం, గంగవరం, కాకినాడ, భీమిలి పోర్టుల్లో మూడో నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీచేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం పోర్టుల్లో ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. మరోవైపు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో శనివారం ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలు, కాలేజీలకు అధికారులు సెలవు ప్రకటించారు. అదేవిధంగా విజయనగరం, పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి జిల్లాల్లోనూ విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు.
