CM Chandrababu Naidu
CM Chandrababu Naidu : ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇవాళ తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ భేటీ జరగనుంది. ఈ సమావేశానికి రాష్ట్ర మంత్రులకూ ఆహ్వానం అందించారు. మధ్యాహ్నం 2.30 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈనెల 22 నుంచి ప్రారంభమవుతున్న పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించనున్నారు. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల నుంచి తెచ్చుకోవలసిన నిధులు, వివిధ కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి మరింత ప్రయోజనం పొందేందుకు చేయాల్సిన కృషిపై ముఖ్యమంత్రి చంద్రబాబు సూచనలు చేయనున్నారు.
Also Read : Heavy Rain : ఏపీలో భారీ వర్షాలు.. ఆ రెండు జిల్లాల్లో రెడ్అలర్ట్.. పాఠశాలలు, కాలేజీలకు సెలవు
అమరావతి, పోలవరం వంటి ప్రాజెక్టులకు కేంద్ర సాయం వంటి అంశాలపై విస్తృత సమన్వయంపై సమావేశంలో చర్చించనున్నారు. కేంద్ర ప్రభుత్వంతో సమన్వయంకోసం ఒక్కో ఎంపీకి ఇప్పటికే కొన్ని శాఖలు చొప్పున బాధ్యతలు కేటాయించారు. ఇవాళ్టి సమావేశంలో మంత్రుల్ని కూడా వారికి జతచేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యతా అంశాలైన అమరావతి, పోలవరం ప్రాజెక్టులకు నిధులు సాధనపై సుదీర్ఘ చర్చ జరిగే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా రైల్వే జోన్లో వివిధ ప్రాజెక్టులకు భూముల కేటాయింపునకు సంబంధించిన పెండింగ్ అంశాల పరిష్కారంపై చర్చించనున్నారు.
Also Read : పవన్ కల్యాణ్ను ఓడించినా గుర్తింపు దక్కలేదని రగిలిపోతున్నారా..! వైసీపీని వీడనున్న గ్రంథి శ్రీనివాస్?
విశాఖ స్టీల్ప్లాంట్ను మళ్లీ గాడిన పెట్టేందుకు చేపట్టాల్సిన చర్యలు, విభజన హామీల్లో భాగంగా రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ సంస్థలకు అవసరమైన పూర్తి సదుపాయాలు కల్పించడం వంటి అంశాలపై చర్చ ఈ సమావేశంలో చర్చించనున్నారు. పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు సీఎం చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు.