Vehicles trapped in flood water : నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు, కడప, నెల్లూరు జిల్లాల్లో కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.
కడప జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. బాలుపల్లి-కుక్కలదొడ్డి మధ్య జాతీయ రహదారిపై నీటి ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద ప్రవాహంలో.. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని వాహనాలు వరద నీటిలో చిక్కుకోవడంతో.. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
వాయుగుండం రేపు తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర మధ్య తీరం దాటనుంది. రేపు తెల్లవారుజామున…చెన్నై సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో ఇప్పటికే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతుండడంతో.. తిరుపతి జలమయమైంది. తిరుమలలో కొండ చరియలు విరిగిపడ్డాయి.
నెల్లూరు జిల్లాలో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కడప జిల్లాలో హైవేపైకి వరద ప్రవాహం పోటెత్తింది. దక్షిణ కోస్తాంధ్ర సముద్ర తీరప్రాంతం గంటకు 45 నుంచి 65 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.