Heat Waves : ఏపీలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఎండల ప్రభావం తీవ్రంగా ఉంది. సోమవారం 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 173 మండలాల్లో వడగాల్పులు వీయన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ వెల్లడించారు. మంగళవారం రాష్ట్రంలోని 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఎండల తీవ్రత పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోమవారం విజయనగరం, మన్యం, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, ఉభయగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు.
ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, ఎస్ పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 45°C – 47°Cల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని తెలిపారు. కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 42°C – 44°C ల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశమున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డా.బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు.