Pawan Kalyan – YS Jagan Mohan Reddy : జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఏపీ సీఎం జగన్ మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటున్నారు. అమ్మఒడి పథకం నిధుల విడుదల సభలో సీఎం జగన్ తనపై చేసిన విమర్శలకు పవన్ కల్యాణ్ ఘాటుగా బదులిచ్చారు. తెలుగు స్పష్టంగా మాట్లాడ లేని వారు మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండటం దురదృష్టకరం అన్నారు పవన్ కల్యాణ్. తెలుగు అక్షరాలన్నీ నేర్పాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో అందరికీ అక్షరమాల నేర్పుతాం అని పవన్ చెప్పారు.
ఈ నెల 30న అన్నీ చెబుతాను:
” భీమవరంలో జనసేన జెండా ఎగరాలి. ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎగరకూడదు. జనసేన రావాలంటే జగన్ పోవాలి. కస్తూరిబా కాలేజీకి దేశ నేతల పేర్లు మార్చడం సరికాదు. నాకు జ్వరం ఉన్నా మీ మీద ప్రేమతో వచ్చా. 30వ తారీకున మొత్తం మాట్లాడతాను. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో వైసీపీ జెండా ఎందుకు ఎగరకూడదో ఈ నెల 30న కారణాలు చెబుతాను. రెండు రోజుల్లో వైసీపీ నాయకులు మరిన్ని తప్పులు చేస్తారు. అమ్మఒడి సభలో ముఖ్యమంత్రి మాట్లాడిన మాటలు ఏమిటి? మీరసలు ముఖ్యమంత్రేనా? నేను చెప్పు తీసి చూపించాను అంటే దాని వెనకాల చాలా కథ జరిగింది” అని పవన్ కల్యాణ్ అన్నారు.
సరిగ్గా అ, ఆ లు నేర్చుకోకపోతే ఇంతే..
సీఎం జగన్ వారాహిని వరాహి అనడంపై స్పందించిన పవన్.. సరిగ్గా అ, ఆ లు నేర్చుకోకపోతే వరాహికి, వారాహికి తేడా తెలియదని ఎద్దేవా చేశారు. జనసేన వయోజన సంచార పాఠశాల పథకం కింద ఈ ముఖ్యమంత్రికి తానే స్వయంగా అక్షరాలు, ఒత్తులు నేర్పిస్తానని పవన్ ఎద్దేవా చేశారు. “ఒక నియంత, కంటకుడు, తెలుగు ఉచ్చారణ రాని జగన్ వంటి వ్యక్తి తెలుగు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండడం బాధాకరం. దీనికి అందరం బాధపడుతున్నాం” అని అన్నారు పవన్ కల్యాణ్.
సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా?
అమ్మఒడి కార్యక్రమానికి వెళ్లిన సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన మాటలేనా ఇవి? అని పవన్ నిలదీశారు. నేను చెప్పు చూపించడానికి ముందు చాలా జరిగిందని తెలిపారు. నేనేమీ ఊరికే చెప్పు చూపించలేదన్నారు. మనతో 24 గంటలూ తిట్టించుకోకపోతే, లేక, తిట్టించుకునేలా వెధవ పనులు చేయకపోతే మేం వైసీపీ నాయకులమే కాదు అన్నట్టుగా ఉంది వీళ్ల వైఖరి చూస్తుంటే అని పవన్ విమర్శించారు.
రేపటి నుంచి ఇలా ఇలా ఇలా మాట్లాడతా.. సీఎం జగన్ కు పవన్ కౌంటర్..
”తాను ఊగిపోతూ మాట్లాడుతున్నానని సీఎం జగన్ తెగ బాధపడిపోతున్నారు. అందుకే, ఇకపై తన స్టైల్ లో కాకుండా.. ముఖ్యమంత్రి జగన్ స్టైల్ లోనే మాట్లాడతా. అమ్మఒడి సభలో అలాంటి మాటలు మాట్లాడొచ్చా? జగన్ కు వరాహికి, వారాహికి తేడా తెలియడం లేదు. సీఎం జగన్ కు అక్షరాలు, ఒత్తులు, దీర్ఘాలు రావు. భవిష్యత్తులో అక్షరాలు నేర్పిస్తా” అని పవన్ కల్యాణ్ అన్నారు.
Also Read..Adala Prabhakar Reddy : పార్టీ మార్పుపై క్లారిటీ ఇచ్చిన వైసీపీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి
నాలుగేళ్లకోసారి భార్యను మార్చడానికి..
పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో జరిగిన కార్యక్రమంలో అమ్మఒడి నిధులను సీఎం జగన్ ఇవాళ రిలీజ్ చేసిన విషయం విదితమే. ఈ కార్యక్రమంలో మాట్లాడిన సీఎం జగన్.. జనసేనాని పవన్ కల్యాణ్ పై తీవ్రస్థాయిలో విమర్శలతో విరుచుకుపడ్డారు. వరాహి అనే లారీ ఎక్కి, ఆవేశంతో ఊగిపోతుంటారని అన్నారు. మాట్లాడితే చాలు… చెప్పుతో కొడతా, గుడ్డలూడదీసి కొడతా అంటారని, బూతులు మాట్లాడుతుంటారని పవన్ పై విమర్శలు చేశారు. నాలుగు పెళ్లిళ్లకు, నాలుగేళ్లకోసారి భార్యను మార్చడానికి పేటెంట్ హక్కులు పవన్ కే ఉన్నాయని ఎద్దేవా చేశారు సీఎం జగన్.