KA Paul: జూనియర్ ఎన్టీఆర్‌ రాజకీయాల్లోకి రాకుండా వారు ఇలా చేస్తున్నారు: కేఏ పాల్

కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని గులాం నబీ ఆజాద్ ను కోరానని, దీంతో ఆయన బయటికి వచ్చారని చెప్పారు.

KA Paul

KA Paul – Junior NTR: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఎమ్మెల్యే బాలకృష్ణ (Balakrishna) కలిసి సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్‌ను రాజకీయాల్లోకి రాకుండా చేస్తున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. వారిద్దరు కలిసి నారా లోకేశ్‌ను పైకి తీసుకొస్తున్నారని చెప్పారు.

తాను ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటించానని అన్నారు. తాను గతంలో ఏయే విషయాలు చెప్పానో అవే ఇప్పుడు జరుగుతున్నాయని తెలిపారు. ప్రజల సమస్యలు విని చాలా బాధపడ్డానని అన్నారు. జనాల కష్టాలు విని తాను 15 నిమిషాలు ఏడ్చానని తెలిపారు. తన కోఆర్డినేటర్ కపిల్ సిబల్ కు రాజ్యసభ సభ్యుడి పదవిని ఇప్పించానని, గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ నుంచి బయటకు రావాలని కోరానని, బయటికి వచ్చారని చెప్పారు.

కేసీఆర్ కు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ఉందని తనకు దిలీప్ కుమార్ చెప్పారని అన్నారు. కవితని అరెస్ట్ చేయకుండా కేసీఆర్ బాగా మేనేజ్ చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చిత్త శుద్ధి ఉంటే ఇకనైనా దళితుడిని సీఎం చేయాలని అన్నారు. మల్లు రవి, మల్లు భట్టి విక్రమార్కను సీఎం చేసినా బాగుంటుందని చెప్పారు.

కాంగ్రెస్ ఇప్పటి వరకు బీసీని కూడా ఎందుకు సీఎం చేయలేదని ప్రశ్నించారు. రెడ్ల, దొరల పాలన తమకు వద్దని అన్నారు. ఎస్సీ, ఎస్టీ ,బీసీలు అందరూ కలిసి తనను గెలిపించాలని కోరారు. వైఎస్ షర్మిల, గద్దర్, కమ్యూనిస్ట్ పార్టీలు అమ్ముడు పోయినట్లు తాను అమ్ముడు పోనని అన్నారు.

బీజేపీతో కలిసి పోటీ చేస్తే పవన్ కల్యాణ్ ఓడిపోతారని చెప్పారు. తాను ఒంటరిగా పోటీ చేస్తున్నానని అన్నారు. తనకు బీజేపీ, కాంగ్రెస్ వాళ్లు పదవులు ఇస్తానని చెప్పినప్పటికీ తాను పదవులు తీసుకోలేదని చెప్పుకొచ్చారు.

Opposition Meet: కూటమికి చాలా ఆసక్తికర పేరు ఎంచుకున్న విపక్షాలు.. ఈ పేరు బీజేపీని ఓడిస్తుందా?

ట్రెండింగ్ వార్తలు