ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌ షాకి వైఎస్ జగన్ విజ్ఞప్తి

ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ..

Ys Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్‌లో రాక్షస పాలన కొనసాగుతోందని, లా అండ్‌ ఆర్డర్‌ అన్నది ఎక్కడా కనిపించడంలేదని మాజీ ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని చెప్పారు.రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతల పరిస్థితులపై దృష్టిపెట్టాలని ప్రధానమంత్రి మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకి విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. వైఎస్సార్‌సీపీని అణగదొక్కాలన్న కోణంలో ఈ దారుణాలకు పాల్పడుతున్నారని తెలిపారు.

కొత్త ప్రభుత్వం వచ్చి నెలన్నర రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్‌ అంటే హత్యలు, అత్యాచారాలు, రాజకీయ కక్షలతో చేస్తున్న దాడులు, విధ్వంసాలకు చిరునామాగా మారిపోయిందని చెప్పారు. నిన్నటి వినుకొండ హత్య ఘటన దీనికి పరాకాష్ఠ అని తెలిపారు. నడిరోడ్డుపై జరిగిన ఈ దారుణ కాండ ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు. ముఖ్యమంత్రి సహా బాధ్యతతో వ్యవహరించాల్సిన వ్యక్తులు రాజకీయ దురుద్దేశాలతో వెనకుండి ఇలాంటి దారుణాలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు.

ఎవరి స్థాయిలో వాళ్లు రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ, పోలీసు సహా యంత్రాంగాలన్నింటినీ నిర్వీర్యం చేశారని అన్నారు. దీంతో నేరగాళ్లు, హంతకులు చెలరేగిపోతున్నారని చెప్పారు. అధికారం శాశ్వతం కాదని, హింసాత్మక విధానాలు వీడాలని చంద్రబాబును గట్టిగా హెచ్చరిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలతో ప్రత్యేక విచారణ జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు.

తాడేపల్లికి చేరుకోనున్న జగన్
వినుకొండ ఘటన నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు బెంగళూరు నుంచి తాడేపల్లి చేరుకోనున్నారు వైఎస్‌ జగన్‌. అనంతరం పార్టీ నేతలతో సమావేశమయ్యే అవకాశం ఉంది.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలెవ్వరూ అధైర్యపడొద్దని అన్నిరకాలుగా అండగా ఉంటామని భరోసా ఇస్తున్నానని తెలిపారు. వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్‌ కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని అన్నారు.

రత్నభాండాగారం మూడో గదిని తెరిచిన అధికారులు

ట్రెండింగ్ వార్తలు