టీడీపీ, జనసేన సంయమనం పాటించాలి: పుంగనూరు ఘటనపై స్పందించిన హోంమంత్రి అనిత
వైసీపీ, టీడీపీ దాడుల నేపథ్యంలో చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు.
- Naga Srinivasa Rao Poduri
- Published On : July 18, 2024 / 03:39 PM IST
Home minister Anitha Vangalapudi
Home minister Anitha Vangalapudi: చిత్తూరు జిల్లా పుంగనూరులో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితులపై ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతిలో గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మిథున్ రెడ్డి కావాలని రెచ్చగొడుతున్నట్టుగా పరిస్థితులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన శ్రేణులు సంయమనం పాటించాలి లేదంటే ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ఆమె పేర్కొన్నారు. అధికారంలో ఉన్నప్పుడు సంయమనం పాటించాల్సిన బాధ్యత టీడీపీ, జనసేన కార్యకర్తలపై ఉందని సూచించారు. వైసీపీ, టీడీపీ దాడుల నేపథ్యంలో పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ రెడ్డప్ప వాహనాలను ప్రత్యర్థులు ధ్వంసం చేశారు.
”ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నంలో భాగంగా కులాలు, మతాలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. క్రిమినల్ కు కులం, మతం చూడకూడదు. చట్టాన్ని ఎవ్వరూ చేతుల్లోకి తీసుకోవద్దు. సామాన్య ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు ప్రవర్తించినా చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. గత ప్రభుత్వ హయాంలో పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అవ్వడం వల్లే వరుస ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ అవశేషాల ప్రభావం వల్లే రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయి. పోలీస్, విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, విద్యాశాఖ సమన్వయంతో చిన్నారుల పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై అవగాహన కార్యక్రమాలు చేపడతాం. త్వరలో కమిటీలు వేయాలని నిర్ణయించామ”ని హోంమంత్రి అనిత తెలిపారు.
Also Read: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాకి వైఎస్ జగన్ విజ్ఞప్తి
