AP Rains : ఏపీలో ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ జిల్లాల్లో మూడ్రోజులు దంచికొట్టనున్న వానలు.. పిడుగుల హెచ్చరికలు..
AP Rains : ఏపీలోని పలు జిల్లాల్లో నేడు మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
- ఏపీలో ప్రజలకు బిగ్ అలర్ట్..
- ఈ జిల్లాల్లో మూడ్రోజులు దంచికొట్టనున్న వానలు..
- అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు
AP Rains : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో గత రెండు రోజులుగా వర్షాలు పడుతున్నాయి. పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుండగా.. కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. అయితే, తాజాగా.. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) వర్షాలపై కీలక సమాచారాన్ని అందించింది. రానున్న మూడురోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది.
Also Read : AP Govt : ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. డ్వాక్రా మహిళలకు శుభవార్త..
రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసింది.
ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) అంచనా ప్రకారం.. మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు దంచికొట్టనున్నాయి. ముఖ్యంగా మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోఅక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి-మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
వర్షాలు పడే సమయంలో ముఖ్యంగా పిడుగులు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, పొలాల్లో పనిచేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిలబడకుండా సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించారు.
ఇదిలాుంటే.. సోమవారం మధ్యాహ్నం వరకు రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగినా.. సాయంత్రానికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. విశాఖపట్టణంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరంలో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల చెట్లు, హోర్డింగులు, విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. వర్షాల ప్రభావం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
