బాబుగారు, ఇప్పటికైనా కళ్లు తెరవండి- ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనలపై షర్మిల రియాక్షన్

ఒడ్డు దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాట‌క బోడి మ‌ల్ల‌న్న... ఇదే బీజేపీ సిద్ధాంతం.

Ys Sharmila (Photo Credit : Google)

YS Sharmila : ఏపీ సీఎం చంద్రబాబు 10 రోజుల వ్యవధిలో రెండోసారి ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే. కేంద్ర పెద్దలను సీఎం చంద్రబాబు కలిశారు. రాష్ట్రానికి భారీగా నిధులు కేటాయించాలని, అభివృద్ధికి సాయం అందించాలని ఆయన కేంద్ర మంత్రులకు పదే పదే విజ్ఞప్తి చేశారు. కాగా, ముఖ్యమంత్రి చంద్రబాబు హస్తిన పర్యటనలపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్రంగా స్పందించారు. సీఎం చంద్రబాబును ఉద్దేశించి పలు ప్రశ్నలు సంధించారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుకు హితబోధ చేశారు.

అయిననూ పోయి రావలె హస్తినకు అన్నట్లుగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటనల తీరు ఉందని షర్మిల విమర్శించారు. NDA కూటమిలో పెద్దన్న పాత్రగా, ఢిల్లీలో చక్రం తిప్పాల్సిన మీరు.. ఢిల్లీ చుట్టూ ఎందుకు చక్కర్లు కొడుతున్నట్లు..? అని ప్రశ్నించారామె. ముక్కుపిండి విభజన సమస్యలపై పట్టుబట్టాల్సింది పోయి.. బీజేపీ పెద్దలకు జీ హుజూర్‌ అంటూ సలాంలు ఎందుకు కొడుతున్నట్లు? అని సీఎం చంద్రబాబును నిలదీశారు షర్మిల.

”కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి సర్కార్ ఏర్పడి నెల రోజులు దాటినా.. మోడీతో గానీ, ఇతర మంత్రులతో గానీ కనీసం ఒక్క హామీ మీద కూడా ఎందుకు ప్రకటన చేయించలేకపోయారు? గెలిచిన రోజు నుంచి నాలుగు సార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా రాష్ట్ర ప్రయోజనాలపై ఒక్క ప్రకటన అయినా వచ్చిందా? విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఉండదని కేంద్ర పెద్దలతో చెప్పించగలిగారా? పోలవరం ప్రాజెక్ట్ కి నిధులపై స్పష్టత ఇచ్చారా? రాజధాని నిర్మాణంపై కేంద్రం ఇచ్చే సాయం ఏంటో చెప్పగలిగారా? ఒడ్డు దాటేదాకా ఓడ మ‌ల్ల‌న్న‌.. దాట‌ాక బోడి మ‌ల్ల‌న్న… ఇదే బీజేపీ సిద్ధాంతం. బాబు ఇప్పటికైనా కళ్లు తెరవడం మంచిది. మరోసారి రాష్ట్ర ప్రజల మనోభావాలతో బీజేపీ ఆటలు ఆడుకుంటోంది అని గుర్తిస్తే మంచిది” అని హితవు పలికారు వైఎస్ షర్మిల.

Also Read : కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్.. బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని..

ట్రెండింగ్ వార్తలు