డిప్యూటీ సీఎం పవన్ స్పందించి బకాయిలు చెల్లించేలా వారిపై చర్యలు తీసుకోవాలి : ఎంపీడీవో కుమారుడు
ఎంపీడీవో వెంకటరమణ పెద్ద కుమారుడు కృష్ణ 10టీవీ ప్రతినిధితో మాట్లాడుతూ.. 35సంవత్సరాలు మానాన్న నిజాయితీగా ఉద్యోగం చేశాడు.
- Harishth Thanniru
- Published On : July 17, 2024 / 02:28 PM IST
Narasapuram MPDO Venkataramana
Narasapuram MPDO Missing Case : నరసాపురం ఎంపీడీవో వెంకటరమణ మిస్సింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. ఏలూరు కాల్వలోకి దూకి వెంకట రమణ సూసైడ్ చేసుకున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. వెంకట రమణ మొబైల్ సిగ్నల్ ట్రాక్ చేశారు. చివరిగా విజయవాడ మధురానగర్ ఏలూరు కాల్వ దగ్గర సిగ్నల్ కట్ అయినట్టు పోలీసులు గుర్తించారు. రాత్రి నుంచి ఏలూరు కాల్వలో గాలింపు చర్యలు చేపట్టారు. ఏలూరు కాలవలో దూకాడనే అనుమానంతో కాలువలోఉన్న గురుపు డెక్కను తొలగిస్తున్నారు. ఘటనా స్థలానికి ఎంపీడీవో వెంకటరమణ కుటుంబ సభ్యులు చేరుకున్నారు. ఇదిలాఉంటే.. సూసైడ్ చేసుకుంటున్నట్లు మంగళవారం కుటుంబ సభ్యులకు వాట్సాప్ లో వెంకట రమణ సూసైడ్ నోట్ పంపించాడు. మాజీ విప్ ప్రసాదరాజు ఇబ్బంది పెడుతున్నారని, బోటింగ్ కాంట్రాక్టర్ 55 లక్షలు బకాయి కట్టమంటే బెదరిస్తున్నాడని అందుకే సూసైడ్ చేసుకుంటున్నట్లు లెటర్ లో వెంకట రమణ తెలిపాడు.
Also Read : సొంతూరికి చేరుకున్న గల్ఫ్ ఎడారి బాధితుడు.. నారా లోకేశ్కు థ్యాంక్స్ చెప్పిన శివ
డిప్యూటీ సీఎం స్పందించి చర్యలు తీసుకోవాలి..
ఎంపీడీవో వెంకటరమణ పెద్ద కుమారుడు కృష్ణ మాట్లాడుతూ.. 35 సంవత్సరాలు మానాన్న నిజాయితీగా ఉద్యోగం చేశాడు. నాలుగు నెలల క్రితం నరసాపురం ఎంపీడీవో గా ఉద్యోగంలో జాయిన్ అయ్యాడు. ఫెర్రీలో కాంట్రాక్టర్ 53లక్షలు బకాయి ఉండటంతో అధికారులు నాన్నపై ఒత్తిడి చేశారు. నాన్నకు కాంట్రాక్టర్ నుంచి డబ్బులు ఇవ్వకుండా మాజీ విప్ ప్రసాద్ రాజు అడ్డుకుంటున్నాడని కృష్ణ ఆరోపించాడు. మా నాన్న ఈ స్థితికి తెచ్చిన వారిని పోలీసులు కఠినంగా శిక్షించాలి. ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు మా నాన్న లేఖ రాశారు. ఆయన వెంటనే స్పందించి ఎవరైతే బకాయిలు చెల్లించాలో వాళ్ళమీద చర్యలు తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడే అవకాశం కల్పించాలని కృష్ణ అన్నారు. నిజాయితీగా ఉద్యోగం చూస్తున్న వారిని ఈ అవినీతిపరులు బతకనివ్వట్లేదు. అలాంటి వారిపై పవన్ కళ్యాణ్ కఠినమైన చర్యలు తీసుకోవాలని కృష్ణ కోరాడు.
Also Read : Oil Tanker Capsizes : సముద్రంలో విషాదం.. 13మంది భారతీయులు గల్లంతు
బాధ్యులుపై చర్యలు తీసుకుంటాం ..
నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీడీవో వెంకటరమణారావు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎంపీడీవోకి జరగరానిది జరిగితే బాధ్యులైన వారిపై కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. నర్సాపురం సఖినేటిపల్లి పెర్రి వేలం పాటలో బకాయిపడ్డ పాట దారుడు, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు, జేఏసీ కమిటీపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అధికారులను మానసిక క్షోభకు గురిచేసి ఇబ్బందులు పెట్టిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఎమ్మెల్యే హెచ్చరించారు.
