Minister Kottu Satyanarayana : ఏపీలో రాజకీయం వేడెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్, వైసీపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఒకరిపై మరొకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. సై అంటే సై అంటూ కయ్యానికి కాలు దువ్వుతున్నారు.
బీసీ నేతలతో సమావేశంలో వైసీపీ ప్రభుత్వాన్ని, కాపులను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో వేడి పెంచాయి. కాపులు, బీసీలు కలిస్తేనే అధికారం సాధ్యం. ఇంకా ఎంత కాలం కాపులు ఎదగకుండా ఇలానే ఉండాలి? ఇంకా ఎంత కాలం దేహీ అని బతకాలి? అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ఫైర్ అవుతున్నారు. పవన్ టార్గెట్ గా ఎదురుదాడికి దిగారు.(Minister Kottu Satyanarayana)
దత్తత తండ్రి చంద్రబాబు.. ఏం చెప్తే అది పవన్ కళ్యాణ్ చేస్తున్నారు అని మంత్రి కొట్టు సత్యనారాయణ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడే విధానం మొత్తం చంద్రబాబు చెప్పేదే అన్నారాయన. పవన్ దగ్గర సబ్జెక్ట్ లేదని విమర్శించిన మంత్రి కొట్టు.. దమ్ముంటే డిబేట్ కు రావాలని ఓపెన్ ఛాలెంజ్ చేశారు. నిన్న పవన్ నిర్వహించిన బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఒక రాజకీయ కుట్ర అని మంత్రి ఆరోపించారు. పవన్ పిచ్చి ఆలోచనలు చేసి కాలేజీ విద్యార్థుల జీవితాలతో ఆడుకోవద్దని హితవు పలికారు.
దత్తతండ్రి చంద్రబాబు ఏది రాసిస్తే.. అది ప్రజల వద్ద వచ్చి చదివే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అని దుయ్యబట్టారు. పవన్ కళ్యాణ్ కాపులతో తిరుగుతూ.. వారినే తిడతారని, అసలు ఆయన ఎందుకు తిడతాడో అర్థం కాదని అన్నారు.
కేంద్ర, రాష్ట్ర, దేవాలయ సహకారంతో శ్రీశైలం ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించామని మంత్రి తెలిపారు. రాబోయే 50ఏళ్ల వరకు క్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వసతి దర్శనం ఏర్పాట్లుకు మాస్టర్ ప్లాన్ రూపొందించామన్నారు.
పేదలకు మంచి చేయాలన్న జగన్ సంకల్పం గొప్పదని, అందుకే భగవంతుడు ముందుకు నడిపిస్తున్నారని మంత్రి కొట్టు అన్నారు. రాష్ట్రంలో ఆలయం లేని ఊరు ఉండకూడదని.. సీఎం జగన్ పెద్ద ఎత్తున ఆలయాల నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. జగన్ సీఎం అయ్యాక కొత్తగా రూ.3,500 ఆదాయం లేని ఆలయాలకు.. కొత్తగా ధూప దీప నైవేద్య పథకంలో ఆర్థిక తోడ్పాటు అందజేసేందుకు అనుమతి ఇచ్చారన్నారు.