Katasani Rambhupal Reddy : కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గంలో సవాళ్ల సర్వం నడుస్తోంది. టీడీపీ నేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రతో పాణ్యం పాలిటిక్స్ హీటెక్కాయి. పాదయాత్రలో భాగంగా పాణ్యం వైసీపీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డిపై నారా లోకేశ్ తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేశారు. దీనిపై స్పందించిన కాటసాని.. తనపై చేసిన అవినీతి ఆరోపణలపై చర్చకు రావాలని లోకేశ్ కు సవాల్ విసిరారు.
తాజాగా మరోసారి లోకేశ్ కు చాలెంజ్ చేశారు ఎమ్మెల్యే కాటసాని. తనపై చేసిన అవినీతి ఆరోపణలపై బహిరంగ చర్చకు రావాలని మరోసారి లోకేశ్, గౌరు చరిత దంపతులకు సవాల్ విసిరారు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.(Katasani Rambhupal Reddy)
” లోకేశ్ విసిరిన ఛాలెంజ్ ను నేను స్వీకరిస్తున్నా. కొండారెడ్డి బురుజు సాక్షిగా నేను చర్చకు రావడానికి సిద్ధంగా ఉన్నా. దమ్ముంటే బహిరంగ చర్చకు రండి. ప్లేస్ ఎక్కడ చెప్పినా సరే” అని ఇంకోసారి సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటసాని. నాపై చేసిన ఆరోపణలను రుజువు చేయండి. ఈ జిల్లానే కాదు. ఆంధ్రప్రదేశ్ ను వదిలిపోతా అని ఎమ్మెల్యే కాటసాని అన్నారు.
” మీరు చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉండాలి. మీరు చేస్తున్న నిరాధార ఆరోపణలపై చర్చకు రండి. బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. రైతుల నుండి డబ్బులు తీసుకున్నట్లు నిరూపించగలరా? రైతుల నుండి ఒక్క రూపాయి తీసుకోలేదు. తీసుకున్నట్లు నిరూపిస్తారా? చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాష్ట్రంలో లేకుండా నన్ను నేనే బహిష్కరించుకుంటా. నా జీవితంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయను. అసలు రాజకీయాల్లోనే ఉండను.(Katasani Rambhupal Reddy)
నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం చేస్తా. నిరూపించకపోతే మీరు రాజకీయ సన్యాసం చేస్తారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు మీ లోకేశ్ చేసిన ఆరోపణలపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలి. నాపై ఆరోపణలు చేసింది మీరు. అది ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది. లోకేశ్ మాటలకు మేము కౌంటర్ ఇవ్వడం జరిగింది.
ఆరోపణలు చేసింది మీరు. వాటిని రుజువు చేయాల్సిన బాధ్యత మీదే. ఏ ఒక్క రైతు దగ్గర ఒక్క రూపాయి తీసుకోలేదని నేను నమ్మిన దేవుడు యాగంటి స్వామి దగ్గర ప్రమాణం చేస్తున్నా. మీరు తీసుకున్నట్లు రుజువు చేసి ప్రమాణం చేస్తారా? అని నారా లోకేశ్, గౌరు దంపతులకు సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి.