Narsipatnam Government Hospital : ఏపీలో విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయి. ఇళ్లు, విద్యాసంస్థలు.. ఆస్పత్రులు అన్నా తేడా లేకుండా ఎడాపెడా కోత విధిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా కోత పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరెంట్ కోతలతో ఆస్పత్రుల్లో రోగులు అల్లాడుతున్నారు. అత్యవసర ఆపరేషన్లకు ఆటంకం కలుగుతోంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ప్రభుత్వ ఆస్పత్రిలో కరెంటు కోతలతో గర్భిణిలకు డెవరీలు కష్టంగా మారుతున్నాయి. ఆస్పత్రిలో జనరేటర్ పనిచేయకపోవడంతో కృష్ణదేవిపేట నుంచి డెలివరీ కోసం గత రాత్రి వచ్చిన ఓ గర్భిణి అష్టకష్టాలు పడ్డారు.
కరెంట్ లేకపోవడంతో పురుడు పోయడానికి కొవ్వొత్తులు కానీ చార్జింగ్ లైట్లు కానీ తీసుకురావాలని ఆస్పత్రి సిబ్బంది గర్భిణి భర్తను ఆదేశించారు. అతనికి ఊరు కొత్త. అప్పటికే సమయం అర్ధరాత్రి అవుతోంది. షాపులన్నీ మూసివేశారు.
ఏమిచేయాలో తెలియని అయోమయంలో పడ్డారు. ఇంతలో గర్భిణికి పురిటి నొప్పులు అధికం కావడంతో మొబైల్ ఫోన్ లైట్ల వెలుగులో డెలివరీ చేశారు.