Guntur : గుంటూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉపాధి కోసం వచ్చిన వలస కూలీల జీవితాలు మంటల్లో కాలి బుడిదయ్యాయి. రేపల్లె మండలం లంకెవాని దిబ్బలో ఆరుగురు వలస కూలీలు సజీవ దహనమయ్యారు. ఒడిశాకు చెందిన ఆరుగురు వ్యక్తులు లంకెవాని దిబ్బ వద్ద ఉన్న రొయ్యల చెరువు కాపలాకు కుదిరారు.
గురువారం రాత్రి చెరువు పక్కనే ఉన్న రేకుల షెడ్డులో నిద్రకు ఉపక్రమించారు. అయితే ఇదే సమయంలో కరెంటు తీగలు రేకుల షెడ్ కి తగిలి మంటలు వ్యాపించినట్లు తెలుస్తుంది. ఈ మంటల్లో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతిచెందారు. వారి మృతదేహాలు గుర్తించలేని విధంగా కాలిపోయాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందని స్థానికులు భావిస్తుండగా.. ఈ దుర్ఘటనకు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని విద్యుత్ శాఖ అధికారులు చెబుతున్నారు.
ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. మృతులను మ్మూర్తి, కిరణ్, మనోజ్, మహేంద్ర, నవీన్, పండబోగా గుర్తించారు. అధికారులు ఆ ప్రాంతానికి మీడియాను అనుమతించడం లేదు.