Sriharikota : నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధనా కేంద్రం (షార్)లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు వైద్యులతో సహా 12మందికి పాజిటివ్ తేలింది. దాంతో షార్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. గత నెల 27వ తేది నుంచి షార్లో వరుసగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. ఒమైక్రాన్ వేరియంట్ అయి ఉండొచ్చనే అనుమానంతో షార్ ఉద్యోగులు భయాందోళనలో ఉన్నారు. సూళ్లూరుపేటలోని షార్ ఉద్యోగుల కేఆర్పీ, డీఆర్డీఎల్ లో ఒక్కొక్కరుగా కరోనా బారినపడినట్టు తెలుస్తోంది. షార్ విశ్రాంత ఉద్యోగికి కూడా కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది.
డిసెంబర్ 27న ఇద్దరికి కరోనా పాజిటివ్ రాగా.. ఆదివారం ఒకరు కరోనా బారినపడినట్టు సమాచారం. కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన షార్ ఉద్యోగులు హోం క్వారంటైన్లో ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. నెల్లూరు జిల్లాలో సోమవారం ఒక్కరోజే 10 కరోనా కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,47,149కి చేరింది. కరోనా నుంచి కోలుకున్న 9 మందిని డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 39,468 మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారు.
దేశంలో కరోనా కేసుల పెరుగుదలతో ముందు జాగ్రత్తగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సెక్రటరీ స్థాయికి దిగువన సిబ్బందిలో 50 శాతం మందికి వర్క్ ఫ్రమ్ హోంకు అనుమతిస్తూ కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వ శాఖలకు తక్షణం వర్తించే ఈ ఆదేశాలు జనవరి 31వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొంది. 50 శాతం మంది మాత్రమే ఆఫీసు విధులకు హాజరు కావాలని, మిగతా సగం మందికి వర్క్ ఫ్రం హోం అమలుచేయాలని సూచించింది. గర్భిణీలు, దివ్యాంగులకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపింది. కంటెయిన్ మెంట్ జోన్లలో నివాసం ఉండే వారికి ఆయా జోన్లను డీనోటిఫై చేసేవరకు ఆఫీసు విధుల నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు వెల్లడించింది.
Read Also : Offline Payments : ఆర్బీఐ కొత్త ఫ్రేమ్వర్క్… ఆఫ్లైన్ పేమెంట్లపై రూ. 200 లిమిట్..!