YS Jagan Birthday: వైఎస్ఆర్.. లక్షల మంది జనాలకు ఇదో ఎమోషన్ ! అలాంటి ఎమోషన్ దాటుకొని.. మనసులు తాకాలంటే అది మాములు విషయం కాదు. మనసులను తాకి.. గెలవడం అంటే అంత ఈజీ కాదు. అదే సాధించారు జగన్ మోహన్ రెడ్డి ! తండ్రికి తగ్గ తనయుడేకాదు.. తనదైన ప్రజాపాలనతో తండ్రిని మించిన తనయుడు అని అనిపించుకుంటున్నారు. కళ్లు తెరిస్తే లక్ష్యమే కనిపించాలి కష్టం కాదు అనే మాటను గట్టిగా నమ్మిన జగన్ అనుకున్నది సాధించారు. రాజకీయంగా ఏ పార్టీ నేత ఎలా విమర్శలు చేసినా, ఎవరు ఎలాంటి ఆరోపణలు గుప్పించినా ఒక్కటి మాత్రం నిజం.. పట్టుదలలో జగన్ను మించిన వారు లేరు. ఆ గుణమే వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టేలా చేసింది. ఆ పట్టుదలే సీఎంను చేసింది. కోట్లమంది అభిమానం సంపాదించుకునేలా చేసింది. రావాలి జగన్.. కావాలి జగన్ నినాదంతో 151 సీట్లను గెలుచుకొని చరిత్ర సృష్టించేలా చేసింది. నేడు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి 50వ వసంతంలోకి అడుగుపెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా జగన్ జన్మదిన వేడుకలను వైసీపీ శ్రేణులతో పాటు ప్రజలు ఘనంగా జరుపుకుంటున్నారు. సేవా కార్యక్రమాలతో ప్రతీ పల్లె జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలతో కోలాహలంగా మారింది.
CM Jagan’s Birthday : రేపు సీఎం జగన్ బర్త్ డే.. సాంస్కృతిక కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు ఏర్పాటు
రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న ఎంతోమందికి వై.ఎస్. జగన్ రాజకీయ జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ధైర్యం, మొండి పట్టుదల, అనుకున్నది సాధించాలనే తపన, నమ్ముకున్న వాడిని కాపాడుకొనే తత్వం, ప్రజల సంక్షేమంకోసం, వారు బాగుకోసం ఏది చేయడానికైనా వెనుకాడని ధీరత్వం.. ఇది చాలు జగన్ను యువ రాజకీయ నేతలు ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లడానికి.
2009లో వైఎస్ఆర్ తనయుడిగా జగన్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో కడప ఎంపీగా గెలిచారు. కొద్ది నెలల వ్యవధిలోనే.. హెలికాప్టర్ ప్రమాదంలో వైఎస్ చనిపోయారు. వైఎస్ఆర్ మరణాన్ని తట్టుకోలేక.. ఆయనను అభిమానించే వందలాది గుండెలు ఆగిపోయాయ్. వారి కుటుంబాలను పరామర్శించడం కోసం జగన్ ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టారు. దీనికి కాంగ్రెస్ పెద్దలు అంగీకారం తెలపకపోవడవంతో.. జగన్ కాంగ్రెస్ హైకమాండ్తో విభేదించి ధైర్యంగా అడుగు ముందుకేశారు. అప్పుడు ఎవరికి తెలియదు జగన్ తీసుకున్న నిర్ణయం సరికొత్త చరిత్రకు నాంది అవుతుందని. తండ్రి మరణంతో ఆగిన ప్రతీ ఇంటి తలుపు తట్టిన జగన్.. తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నాడు. కష్టం అయినా, నష్టం అయినా చిరునవ్వుతో ప్రజలను పలుకరిస్తూ జగన్ అనుకున్నది సాధించాడు.
36ఏళ్ల వయసులో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన జగన్ ప్రతీ ప్రతికూల పరిస్థితుల్లోనూ మొండి పట్టుదలతో లక్ష్య దిశగానే సాగారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అనుకున్నది సాధించాలనే తపనతో ముందుకు సాగారు. కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా లక్ష్యంకోసం ముందుకు సాగితే ఎవరికైనా విజయం తప్పక సిద్ధిస్తుందని చెప్పడానికి జగన్ రాజకీయ ప్రస్థానమే నిదర్శనంగా నిలుస్తుంది. రాజకీయంగా ఎవరు ఎలాంటి ఆరోపణ అయినా చేయొచ్చు. ఐతే ఓ వ్యక్తిగా, ఓ నాయకుడిగా జగన్ రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి స్ఫూర్తి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఐతే పట్టుదలతోనే 2019 ఎన్నికల్లో అద్భుతమైన మెజారిటీతో పార్టీకి విజయాన్ని కట్టబెట్టారు. ఇప్పుడు 50వ పుట్టినరోజు జగన్ జరుపుకుంటున్నారు. ఇకపై ఆయన రాజకీయ ప్రస్థానం ఎలా ఉండబోతుందన్నదే ఆసక్తికరంగా మారింది.