Sadineni Yamini Fire YCP : ఏపీలో వైసీపీ పాలన చాలా దారుణంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సాధినేని యామిని అన్నారు. మహిళల పుస్తెలు తెగడానికి, యువత పెడదోవ పట్టడానికి జగన్ విధానాలే కారణమని పేర్కొన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు రావు, ఉన్నవి కూడా వెళ్లిపోతున్నాయని తెలిపారు. ఈ ప్రభుత్వానికి పరిశ్రమలు తీసుకురావడం చేతకాదని విమర్శించారు. రాష్ట్రంలో విషపూరితమైన సంస్కృతి పెరిగిందన్నారు.
ఈ మేరకు శుక్రవారం ఆమె విజయవాడలో మీడిమాలో మాట్లాడారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మహిళ అని కూడా చూడకుండా వ్యక్తిత్వ హననం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా ఈ తరహా తిట్లు రాజకీయాల్లో పెరిగాయన్నారు. ఇలాంటి వ్యాఖ్యలను బీజేపీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. ఏపీలో మహిళలు, బాలికలపై దారుణాలు పెరిగి పోయాయని వెల్లడించారు. ఏపీలో మద్యం, గంజాయితో యువత మత్తులో చిత్తు అవుతుందన్నారు.
బాలికల పాఠశాలల్లో సరైన వసతులు కల్పించలేదని విమర్శించారు. జలజీవన్ మిషన్ ద్వారా కేంద్రం ఏపీకి కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందన్నారు. పనులు చేసిన కాంట్రాక్టర్ లకు బిల్లులు చెల్లించడం లేదని విమర్శించారు. దీంతో అనేక జిల్లాల్లో కాంట్రాక్టర్లు పనులు ఆపేశారని పేర్కొన్నారు. జగన్ మామా అంటూ ప్రకటనలు ఇప్పించుకుంటారని తెలిపారు.
రేపు వారికి ఏదైనా జరిగితే జగన్ మోహన్ రెడ్డి బాధ్యత వహిస్తారా అని ప్రశ్నించారు. జల జీవన్ మిషన్ డాష్ బోర్డులో మాత్రం అంతా గొప్పగా చూపిస్తారని తెలిపారు. అంటే కేంద్రాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. కేంద్రం ఇచ్చే నిధులు దేనికి ఖర్చు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.