నక్సలైట్ల ఘాతుకం.. ఇద్దరు భద్రతా సిబ్బంది మృతి.. మరో నలుగురికి గాయాలు

నక్సలైట్ల దాడిలో మృతి చెందిన జవాన్లను రాయ్‌పూర్‌కు చెందిన కానిస్టేబుల్ భరత్ సాహు, నారాయణపూర్‌కు..

బీజాపూర్ జిల్లాలో నక్సల్స్ దారుణానికి పాల్పడ్డారు. ఐఈడీని పేల్చి ఇద్దరు భద్రతా సిబ్బంది ప్రాణాలు తీశారు. మరో నలుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారని బస్తర్ పోలీసులు తెలిపారు. బీజాపూర్, దంతేవాడ, సుక్మా సరిహద్దు ప్రాంతంలో దర్భా డివిజన్, వెస్ట్ బస్తర్ డివిజన్ నక్సల్స్ ఉన్నట్లు సమాచారం అందడంతో భద్రతా సిబ్బంది సోదాలు నిర్వహించింది.

ఇందులో ఎస్టీఎఫ్, డీఆర్జీ, కోబ్రా, సీఆర్పీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. నక్సలైట్ల దాడిలో మృతి చెందిన జవాన్లను రాయ్‌పూర్‌కు చెందిన కానిస్టేబుల్ భరత్ సాహు, నారాయణపూర్‌కు చెందిన కానిస్టేబుల్ సత్యర్ సింగ్ కాంగేగా అధికారులు గుర్తించారు. భద్రతా సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ ముగించుకుని తిరిగి వస్తుండగా ఈ దాడి జరిగిందని వివరించారు.

గాయపడిన జవాన్లకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. కాగా, బుధవారం కూడా నక్సలైట్ల వ్యతిరేక ఆపరేషన్‌ నిర్వహించిన భద్రతా సిబ్బంది మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని వండోలి గ్రామం వద్ద 12 మంది నక్సల్స్‌ను హతమార్చిన విషయం తెలిసిందే. అలాగే. భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాతి రోజే నక్సలైట్లు ఐఈడీ పేల్చి జవాన్ల ప్రాణాలు తీయడం గమనార్హం.

Also Read: వినుకొండలో నడిరోడ్డుపై అతి దారుణం.. 144 సెక్షన్ అమలు

 

ట్రెండింగ్ వార్తలు