Bombay High Court: దేశంలో చెత్త.. విదేశాల్లో శుభ్రమా?.. ప్రజల తీరుపై బాంబే హైకోర్టు సంచలన వ్యాఖ్యలు!
ముంబయిలోని డంపింగ్ యార్డుల్లో పెరుగుతున్న కాలుష్యం, విష వాయువుల ఉద్గారాలపై దాఖలైన పిటిషన్లపై బాంబే హైకోర్టు(Bombay High Court) పౌరుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో స్పందించింది.
Bombay high court slams citizens littering spitting civic sense
- పౌరుల బాధ్యతపై ఆగ్రహం
- పరిశుభ్రతపై హైకోర్టు హెచ్చరిక
- అధికారులకు కఠిన ఆదేశాలు
Bombay High Court: ముంబయిలోని డంపింగ్ యార్డుల్లో పెరుగుతున్న కాలుష్యం, విష వాయువుల ఉద్గారాలపై దాఖలైన పిటిషన్లపై విచారణ సందర్భంగా బాంబే హైకోర్టు(Bombay High Court) పౌరుల ప్రవర్తనపై తీవ్ర స్థాయిలో స్పందించింది. ప్రతిరోజూ వీధుల్లో చెత్త పారవేయడం, రోడ్లపై ఉమ్మివేయడం వంటి అలవాట్లను ధర్మాసనం తీవ్రంగా తప్పుపట్టింది. స్వదేశంలో ఇష్టానుసారంగా వ్యవహరించే ప్రజలు.. విదేశాలకు వెళ్లగానే బాధ్యతాయుతంగా మారి ఒక చిన్న చాక్లెట్ కవర్ను కూడా బయట పడేయడానికి భయపడతారని న్యాయస్థానం ఎద్దేవా చేసింది.
జస్టిస్ జి.ఎస్. కులకర్ణి, జస్టిస్ ఆర్తి సాఠేలతో కూడిన ధర్మాసనం విచారణ సందర్భంగా పౌర బాధ్యతను బలంగా ఉద్ఘాటించింది. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి ప్రాథమిక బాధ్యత అని, అలాంటి బాధ్యతాయుత పౌరులకే మంచి వాతావరణాన్ని కోరుకునే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. వీధులు, ఖాళీ స్థలాల్లో చెత్త పడేసే వారిపై, రోడ్లపై ఉమ్మేసే వారిపై అధికారులు వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
అసలు మనం నాగరిక సమాజంలోనే జీవిస్తున్నామా అని ప్రశ్నించిన హైకోర్టు, ప్రధాన రహదారుల్లో పేరుకుపోతున్న చెత్త వల్ల ప్రజలు తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేసింది. చివరికి హైకోర్టు భవనం, వారసత్వ కట్టడాల వద్ద కూడా మున్సిపల్ వాహనాల అస్తవ్యస్త నిర్వహణ వల్ల విదేశీ పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంది. ఈ పరిస్థితిని చక్కదిద్దేందుకు వారం రోజుల్లోగా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది.
