CM Jagan Temple : ఏసీ సీఎం జగన్ కు ఫ్యాన్స్ చాలామందే ఉన్నారు. వారిలో కొందరు వీరాభిమానులు కూడా ఉన్నారు. జగన్ ను గుండెల్లో పెట్టుకుని చూసుకునే వారూ, ఆయనను దేవుడిలా చూసేవారూ లేకపోలేదు. సామాన్య ప్రజలు, కార్యకర్తలే కాదు.. ప్రజా ప్రతినిధుల్లో సైతం జగన్ కు వీరాభిమానులు ఉన్నారు.
తాజాగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరో అడుగు ముందుకేశారు. సీఎం జగన్ పై తనకున్న అభిమానం అందరికీ తెలిసేలా ఏకంగా ఆలయాన్నే నిర్మిస్తున్నారు. నియోజకవర్గంలోని వైఎస్ఆర్ జగనన్న కాలనీలో ఈ గుడి నిర్మిస్తున్నారు. ఆలయానికి పక్కనే దివంగత వైఎస్ఆర్ విగ్రహం ఏర్పాటు చేశారు. ఆలయానికి ముందు నవరత్న పథకాల(ఫీజు రీఎంబర్స్ మెంట్, ఆరోగ్య శ్రీ, అమ్మఒడి, వైఎస్ఆర్ ఆసరా, పేదలందరికీ ఇల్లు, పెన్షన్ పెంపు తదితర పథకాల) స్థూపాలను ఉంచారు. ఆలయం లోపల ఒక్కో పథకానికి సంబంధించి ఒక్కో బోర్డును ఏర్పాటు చేశారు. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అర్హులు ఎవరు? అనే వివరాలు అందులో ఉంచారు. పంచ లోహాలతో విగ్రహాలు తయారు చేయిస్తున్నారు. కాగా, ఈ ఆలయ నిర్మాణానికి ఇప్పటివరకు రూ.2కోట్లు ఖర్చైనట్లు తెలుస్తోంది.
తాను జగన్ కు భక్తుడిగా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చెప్పుకుంటారు. జగన్ పై ఉన్న అభిమానాన్ని ఇప్పుడిలా చాటుకుంటున్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగనన్న ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టి అందరి దృష్టిని తనవైపు మళ్లించుకున్నారు. ఈ ఆలయ నిర్మాణానికి ఎమ్మెల్యే 75 శాతం సొంత నిధులు వెచ్చించగా.. మిగిలింది వైసీపీ నేతలు, కార్యకర్తలు చందాలు వేసుకొని ఇచ్చినట్టు సమాచారం.