Google Earthquake Alert System : ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ (Google) అత్యంత ఉపయోగకరమైన భూకంప హెచ్చరిక వ్యవస్థ (Android Earthquake Alert System) భారత్కు రాబోతోంది. 2020లో గూగుల్ ప్రకటించిన ఈ కొత్త ఫీచర్ ఇప్పుడు భారత్లో అందుబాటులోకి వచ్చింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (NDMA), నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (NCS), మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్తో కలిసి ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థను ప్రారంభించినట్లు గూగుల్ ఒక బ్లాగ్పోస్ట్లో ప్రకటించింది.
భూకంపాలు ఒక సాధారణ ప్రకృతి వైపరీత్యం, ముందస్తు హెచ్చరికలతో ప్రాణాలు, ఆస్తులను రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికల వ్యవస్థ ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలోని ఇంటర్నల్ సెన్సార్లను ఉపయోగిస్తుంది. వీటిని యాక్సిలరోమీటర్లు అంటారు. యాక్సిలరోమీటర్లు సూక్ష్మ సీస్మోమీటర్లుగా పనిచేస్తాయని బ్లాగ్ పోస్ట్ పేర్కొంది.
ఇదేలా పని చేస్తుందంటే? :
ఆండ్రాయిడ్ ఫోన్ ప్లగ్-ఇన్ చేయాలి. ఛార్జింగ్ అవుతున్నప్పుడు భూకంపం ప్రారంభ ప్రకంపనలను గుర్తిస్తుంది. అది వెంటనే డేటాను సెంట్రల్ సర్వర్కు పంపుతుందని గూగుల్ పేర్కొంది. ఒకే ప్రాంతంలోని మల్టీ ఫోన్లు ఒకే విధమైన ప్రకంపనలను గుర్తిస్తే, సర్వర్ భూకంపం, భూకంప కేంద్రం, తీవ్రతతో సహా దాని లక్షణాలను అంచనా వేయగలదు. తదనంతరం, సమీపంలోని ఆండ్రాయిడ్ డివైజ్లకు వేగంగా హెచ్చరికలను పంపుతుంది. ఈ హెచ్చరికలు ఇంటర్నెట్లో కాంతి వేగంతో ప్రయాణిస్తాయి. మరింత తీవ్రమైన ప్రకంపనలు వచ్చేటప్పుడు చాలా సెకన్ల ముందు తరచుగా వినియోగదారులను అలర్ట్ చేస్తాయి. విస్తృత శ్రేణి వినియోగదారులకు యాక్సస్ అందించేలా ఆండ్రాయిడ్ సపోర్టుతో వివిధ భారతీయ భాషలలో అందుబాటులో ఉన్నాయి.
Google launches earthquake alert system for Android users in India
ఏ ఆండ్రాయిడ్ డివైజ్ల్లో ఫీచర్ సపోర్టు చేస్తుందంటే? :
ఆండ్రాయిడ్ 5 లేదా అంతకంటే కొత్త వెర్షన్ రన్ అయ్యే డివైజ్లను కలిగిన ఆండ్రాయిడ్ యూజర్లు రాబోయే వారంలో ఫీచర్ని అందుకుంటారు. వినియోగదారులు Wi-Fi లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ భూకంప హెచ్చరికలు, లొకేషన్ సెట్టింగ్లు రెండూ ఎనేబుల్ చేయాలి. ఈ హెచ్చరికలను స్వీకరించకూడదనుకునే వారికి, డివైజ్ సెట్టింగ్లలో భూకంప హెచ్చరికలను Off చేసే ఆప్షన్ కూడా ఉంది. అదనంగా, ఆండ్రాయిడ్ యూజర్లు ‘Near Me Earthquake’ వంటి పదాల కోసం సెర్చ్ చేసినప్పుడు.. సురక్షితంగా ఉండేందుకు వారికి సంబంధిత సమాచారాన్ని అందుకుంటారు.
NDMAతో గూగుల్ భాగస్వామ్యంతో సకాలంలో భూకంపం హెచ్చరికలు, భద్రతా సమాచారాన్ని అందించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో, గూగుల్ సెర్చ్, మ్యాప్స్ ద్వారా వరదలు, తుఫానుల వంటి ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించిన భద్రతా సమాచారాన్ని వినియోగదారులకు అందించడానికి (NDMA)తో Google సహకరించింది. ఈ కొత్త చొరవతో భారత్లోని ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందస్తు భూకంప హెచ్చరికలకు యాక్సెస్ను కలిగి ఉంటారు. సకాలంలో జాగ్రత్తలు తీసుకోవడానికి, భూకంప కార్యకలాపాల సందర్భంలో తమకు, ప్రియమైనవారికి భద్రతను అందించవచ్చు.