షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతారు, ఇక్కడ అధికారంలో ఉన్నది బీజేపీనే- ఏపీ రాజకీయాలపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కడప ఉప ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్న సీఎం రేవంత్.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు.

Cm Revanth Reddy : మంగళగిరిలో వైఎస్ఆర్ జయంతి సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.. ఏపీ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో అధికారంలో ఉన్నది బీజేపీయే అని ఆయన అన్నారు. ఏపీలో ప్రతిపక్షమే లేదన్నారు. బీజేపీ అంటేనే చంద్రబాబు, జగన్, పవన్ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. వీరంతా మోదీ పక్షమే అని ఆయన తేల్చి చెప్పారు.

ఆంధ్రప్రదేశ్ లో ప్రజల కోసం ఉన్నది, ప్రజల పక్షాన నిలబడి కొట్లాడేది వైఎస్ షర్మిల మాత్రమే అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు. అంతేకాదు.. 2029లో షర్మిల ఏపీకి ముఖ్యమంత్రి అవుతారని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ కార్యకర్తల త్యాగం, ఆమె పోరాటం వృధా కాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులుగా వారసత్వం రాదని, ఆశయాలు మోసే వారికి మాత్రమే వారసత్వం వస్తుందని రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

ఏపీలో కాంగ్రెస్ గెలుపునకు, కార్యకర్తల కోసం తెలంగాణ కాంగ్రెస్ అండగా నిలుస్తుందని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఏపీలో కాంగ్రెస్ కి అండగా నిలుస్తామని చెప్పటానికి మంత్రివర్గంతో సహా ఇక్కడికి వచ్చామన్నారు. కడప ఉపఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్న సీఎం రేవంత్.. అదే జరిగితే కడపలో ప్రతి ఊరు తిరగటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. ఎక్కడైతే కాంగ్రెస్ కి దెబ్బ తగిలిందో అదే కడప నుంచే మళ్ళీ ఏపీ కాంగ్రెస్ జెండా ఎగరవేయటానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

”2 తెలుగు రాష్ట్రాల్లో చర్చ జరిగినపుడు వైఎస్ఆర్ లేని లోటుపై చర్చ జరుగుతుంది. రెండు రాష్ట్రాల్లో వైఎస్సార్ కు లక్షలాది మంది అభిమానులు ఉన్నారు. మండలిలో బలమైన వాదన వినిపించి వైఎస్సార్ దృష్టిలో పడేందుకు రాత్రంతా ప్రిపేర్ అయ్యే పరిస్థితి అప్పట్లో ఉండేది. సభలో ప్రశ్నించే వారిని ప్రోత్సహించే విధంగా సమాధానం ఇవ్వాలనేది వైఎస్సార్ విధానం. ఇది వైఎస్ఆర్ నుంచి మేం నేర్చుకున్నాం. ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా వైఎస్ఆర్ వ్యవహరించిన తీరు ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతిపక్షాలు, కార్మిక సంఘాలు చెప్పే సమస్యలు వినేందుకు సీఎంగా సమయం ఇచ్చేవారు. ఆయన స్ఫూర్తితో రాహుల్ గాంధీ పాదయాత్ర చేశారు. రాహుల్ పాదయాత్ర వల్ల కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది.

100 సీట్లతో ప్రధాన ప్రతిపక్ష పాత్రను రాహుల్ పోషిస్తున్నారు. వైఎస్ఆర్ అంటేనే మాట తప్పడు, మడమ తిప్పడు. 20 ఏళ్లు ప్రతిపక్షంలో కొట్లాడితే ఇప్పుడు సీఎం అయ్యాను. ఏపీలో ఇప్పటి పరిస్థితులు చూస్తుంటే షర్మిల కూడా గతంలో వైఎస్సార్ మాదిరి పని చేస్తోంది. 1999లో వైఎస్సార్ మాదిరి షర్మిల ఇపుడు ఏపీలో ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రతిపక్షంగా పనిచేస్తోంది” అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : బీజేపీ డైరెక్షన్‌లో చంద్రబాబు.. అందుకే తెలంగాణలో టీడీపీని..: జగ్గారెడ్డి