Cyber Crime : సెల్ ఫోన్ కు వచ్చే ఉచిత బహుమతులు బంపర్ లాటరీల మెసేజ్ లు ఓపెన్ చేశారా….మీ బ్యాంక్ ఎకౌంట్ లోని డబ్బులు మొత్తం మాయం అయిపోతాయి. సికింద్రాబాద్ లోని ఒక వ్యక్తికి ఇలాంటి మెసేజ్ లే పంపించి అతని వ్యాలెట్ నుంచి రూ. 25లక్షలు కాజేశారు సైబర్ నేరగాళ్లు.
సికింద్రాబాద్ కు చెందిన ఒక వ్యక్తికి సైబర్ నేరగాళ్లు బహుమతులు గెలుచుకున్నారు…లాటరీ గెలుచుకున్నారు అంటూ అతని సెల్ ఫోన్ కు మెసేజ్ లు పంపించారు. ఇలా రెండు మూడు మెసేజ్ లు రాగానే వాటిని యధాలాపంగా ఆ వ్యక్తి క్లిక్ చేశాడు. వెంటనే అతని వివరాలన్నీ సైబర్ నేరగాళ్లకు చిక్కాయి. వెంటనే వారు ఫోన్ హ్యాక్ చేసారు.
బాధితుడు బిట్ కాయిన్ లను కొని వ్యాలెట్ లో దాచుకున్నాడని గమనించారు. వెంటనే 35 వేల అమెరికన్ డాలర్లు (దాదాపు రూ.25లక్షలు) బదిలీ చేసుకున్నారు. ఆ లావాదేవీలకు సంబంధించి వచ్చిన ఎస్ఎంఎస్ లను, వ్యాలెట్ మెసేజ్ లను ఫోన్ లోంచి డిలీట్ చేశారు. దీంతో బాధితుడు తన వ్యాలెట్ లోని డాలర్లు పోగోట్టుకున్నట్లు తెలుసుకోలేకపోయాడు.
Also Read : Married Woman Eloped : బంగారం,డబ్బు తీసుకుని లడ్డూ లాంటి ప్రియుడితో పరారైన భార్య
తర్వాత చెక్ చేసుకోగా వాటిని కోల్పోయినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాధితుడికి ఒక ఎస్ఎంఎస్ యూఎస్ నుంచి, మరోకటి ఆస్ట్రేలియా నుంచి వచ్చినట్లు గుర్తించారు.
ఇదే తరహాలో హాట్ మెయిల్ ద్వారా వచ్చే మెయిల్స్ను కూడా ఓపెన్ చేయవద్దని సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. జీమెయిల్, యాహూ మెయిల్, ఖాతాల్లా హాట్ మెయిల్ ఖాతాలను ఓపెన్ చేసిన నేరగాళ్లు అందులోకి టోర్టీ సాఫ్ట్వేర్ను డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దాని సాయంతోనే సెల్ఫోన్లను హ్యాక్ చేస్తున్నారని పోలీసులు తెలిపారు. సైబర్ నేరస్థులు కార్పోరేట్, ప్రైవేట్ సంస్ధల రహస్య వివరాలను సేకరించి బ్లాక్ మెయిల్ చేసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.