Manjula
Shamshabad Woman death Case: అప్పు ఇచ్చి మహిళను ఆదుకున్న పాపానికి ఆమె చేతిలోనే బలైపోయింది మరో మహిళ. హైదరాబాద్ (Hyderabad) శివారులోని శంషాబాద్లో ఇళ్ల స్థలాల మధ్య ఓ మహిళను పెట్రోల్ పోసి చంపేసిన కేసును పోలీసులు ఛేదించారు. శంషాబాద్ డీసీపీ నారాయణ రెడ్డి (DCP Narayana Reddy)ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. ఈ నెల 10న అర్ధరాత్రి మహిళ మృతదేహాన్ని గుర్తించామని అన్నారు.
మృతురాలిని వడ్ల మంజులగా గుర్తించామని చెప్పారు. ఆమె గురువారం ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి వెళ్లింది. అదే రోజు మంజుల మిస్సింగ్ కేసు నమోదు అయ్యింది. ఆర్థిక లావాదేవీలే హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. రిజ్వానా బేగం అనే మహిళకు మంజుల లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చింది.
అనంతరం రిజ్వానా కనీసం వడ్డీ కూడా చెల్లించలేదు. ఇటీవల రిజ్వానా ఇంటికి భర్తతో కలిసి వెళ్లిన వడ్ల మంజుల గొడవ పెట్టుకుంది. డబ్బు తిరిగివ్వాలని డిమాండ్ చేసింది. రెండు నెలలుగా వడ్డీ చెల్లించకపోవడం సరికాదని ఒత్తిడి చేసింది. దీంతో ఆమెను చంపేస్తే ఆ డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉండదని భావించిన రిజ్వానా రెండు రోజుల క్రితం మంజులను ఓ ప్రాంతంలో కలిసి ఆమె కళ్ల లో కారం కొట్టింది.
అనంతరం చీర కొంగుతో మంజుల మెడ గట్టిగా ఊపిరి ఆడకుండా చేసి చంపింది. ఆ తర్వాత పెట్రోల్ తో మంజుల మృతదేహాన్ని తగులబెట్టింది. 24 గంటల్లోనే కేసును ఛేదించామని పోలీసులు తెలిపారు.
రిజ్వానా బేగాన్ని ఆరెస్ట్ చేసి రీమాండ్ కు తరలిస్తామని అన్నారు. ఒక్క రిజ్వానానే ఇదంతా చేసిందని చెప్పారు. మంజుల చనిపోయిన తర్వాత ఆమె మెడలో ఉన్న బంగారాన్ని, చెవుల రింగ్స్ ను చోరీ చేసింది రిజ్వానా. ఆ నగలను ముత్తూట్ ఫైనాన్స్ లో తాకట్టు పెట్టింది. భర్తతో అజ్మీరా వెళ్లానని టికెట్స్ బుక్ చేసుకుంది. ఇంతలో ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Tirumala Cheetah Attack : తిరుమలలో బాలికను చిరుత చంపినట్లు పోస్టుమార్టం రిపోర్టు