TSRTC Merger With Government : హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఆర్టీసీ(RTC) జేఏసీ నాయకులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం(TSRTC Merger) చేస్తూ కేబినెట్ లో(Cabinet) తీసుకున్న నిర్ణయాన్ని జేఏసీగా స్వాగతిస్తున్నాం అని ఆర్టీసీ జేఏసీ ఛైర్మన్ అశ్వద్దామ రెడ్డి చెప్పారు. ఆర్టీసీ సమ్మె కూడా విలీనం కోసమే జరిగిందని ఆయన గుర్తు చేశారు. విలీనానికి వెంటనే కమిటీ వేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం(RTC Merger With Government) తెలంగాణ ఉద్యమ ఆకాంక్షకు నిదర్శనం అని చెప్పారు. ఆర్టీసీ సమ్మె సమయంలో 34మంది మరణించారని వెల్లడించారు. ఈ విజయాన్ని ఆర్టీసీ.. అమరులకు అంకితం చేస్తుందన్నారు. కాగా, కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా టైం బాండ్ లో విలీన ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారాయన. 2017-21 వేతన సవరణ కూడా చేయాలన్నారు. కమిటీ.. కార్మికుల సూచనలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ”నెలలోపు విలీనం పూర్తి చేయాలి. కమిటీలపై కార్మికులకు అనుమానాలు ఉన్నాయి. వాటిని ప్రభుత్వం నివృత్తి చేయాలి. ఆర్టీసీ ఉద్యోగులకు పని భారం పెరిగింది” అని అశ్వద్దామ రెడ్డి అన్నారు.
హన్మంతు ముదిరాజ్, ఆర్టీసీ జేఏసి కన్వీనర్..
అసెంబ్లీలో బిల్ పెట్టి విలీనం చేస్తామని సీఎం కేసీఆర్ చెప్పడాన్ని స్వాగతిస్తున్నాం. ఎలాంటి నిబంధనలు పెట్టకుండా ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. విలీనంపై మాకు అనుమానాలు ఉన్నాయి. వాటిని నివృత్తి చేయాలి. మాకు రావాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలి. Ccs నిధులు చెల్లించాలి. విధివిధానాలు ప్రకటించి నెలలోపు విలీన ప్రక్రియ పూర్తి చేయాలి.
టీఎస్ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ కేసీఆర్(CM KCR) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించనున్నట్టు సర్కార్ ప్రకటించింది. ఇకపై 43వేల 373 మంది ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులు అవుతారు. సుదీర్ఘంగా సాగిన కేబినెట్ భేటీలో ఆర్టీసీ విలీనంపై నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించే బిల్లును ఆగస్టు 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి కేటీఆర్(Minister KTR) తెలిపారు. అందుకు సంబంధిన కార్యాచరణ ప్రారంభించాలని రవాణశాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రికి సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు కేటీఆర్ వెల్లడించారు.
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ అంశానికి సంబంధించిన విధివిధానాలపై సబ్ కమిటీ ఏర్పాటు చేయనున్నట్టు కేటీఆర్ తెలిపారు. ఈ సబ్ కమిటీలో అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్అండ్బీ, రవాణశాఖ, జేఏడీ శాఖ కార్యదర్శులు, కార్మికశాఖ స్పెషల్ సెక్రెటరీ సభ్యులుగా ఉంటారు. పూర్తి నివేదికను వెంటనే సిద్ధం చేసి.. ప్రభుత్వానికి వీలైనంత తొందరగా అందజేయాలని ఆదేశించినట్టు మంత్రి కేటీఆర్ వెల్లడించారు.