Covovax India : భారత్లో మరో కరోనా టీకా రానుంది. 12ఏళ్ల నుంచి 17ఏళ్ల పిల్లల కోసం ఈ కరోనా టీకా అందుబాటులోకి రానుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారుచేసిన కోవోవాక్స్ (Covovax) అత్యవసర వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI) షరతులతో అనుమతినిచ్చింది. ఇప్పటికే దేశంలో 18ఏళ్ల లోపు పిల్లలకు నాల్గో కరోనా వ్యాక్సిన్ కోవాగ్జిన్ అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ Covovax టీకాకు అత్యవసర వినియోగానికి అనుమతి ఇవ్వాలని గతవారమే డీసీజీఐకి నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంలోనే పిల్లలకు సంబంధించి మరో కరోనా టీకా అత్యవసర వినియోగానికి భారత్ ఔషధ నియంత్రణ సంస్థ అనుమతినిచ్చింది. కొన్ని షరతులతో కొవోవ్యాక్స్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.
ఇదిలా ఉండగా, 15ఏళ్ల లోపు వారికి వ్యాక్సినేషన్ విషయంలో ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే ఈ విషయంలో మరింత అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ గ్రూపు వయస్సు పిల్లలకు వ్యాక్సిన్ ఇంకా అందుబాటులోకి రాలేదు. దీనిపై కేంద్రం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న వాదన వినిపిస్తోంది. ఈ క్రమంలోనే Covovax టీకాను 12-17 ఏళ్ల పిల్లలకు వినియోగించేందుకు డీసీజీఐ అనుమతి ఇచ్చింది. ఆ తర్వాతే ఈ గ్రూప్ వయస్సు పిల్లల వ్యాక్సినేషన్పై కూడా త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉంది.
మరోవైపు.. భారత్ బయోటెక్ అభివృద్ధి చేస్తున్న చుక్కల మందు టీకా (BBV154/నాసల్ వ్యాక్సిన్)పై మూడో దశ క్లినికల్ పరీక్షలు ఈ వారంలో ప్రారంభం కానున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలోని అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ (AIMS) సహా దేశవ్యాప్తంగా 9 ప్రాంతాల్లో ఈ టెస్టులను నిర్వహించనున్నారు. ఈ మేరకు భారత్ బయోటెక్ వర్గాలు రంగం సిద్ధం చేసినట్టు తెలిసింది. దాదాపు 5,000 మంది వాలంటీర్లతో ఈ పరీక్షలు మొదలవుతాయని అంచనా. ఈ టెస్టులకు సంబంధించి భారత ఔషధ నియంత్రణ మండలి కూడా అనుమతి అనుమతినిచ్చింది. రెండు డోసుల కొవాగ్జిన్ లేదా కొవిషీల్డ్ టీకా తీసుకున్న వారికి బూస్టర్ డోసు ద్వారా ఈ చుక్కల మందు టీకాగా ఇస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనే అంశాన్ని మూడో దశ క్లినికల్ పరీక్షల్లో అధ్యయనం చేయనున్నట్లు సమాచారం.
Read Also : AP Covid : ఏపీలో కరోనా లెటెస్ట్ అప్ డేట్.. రెండు జిల్లాలో సున్నా కేసులు..మరణాలు లేవు