Team India: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final) ముందు టీమ్ఇండియా(Team India)కు ఓ శుభవార్త అందింది. అదే సమయంలో మరో ఆటగాడు గాయపడడం ఆందోళన కలిగిస్తోంది. వెన్నునొప్పితో ఇబ్బంది పడుతున్న సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ పూర్తిగా కోలుకుని ఫిట్నెస్ సాధించగా ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్తో జరిగిన మ్యాచ్లో ఇషాన్ కిషన్ గాయపడ్డాడు.
లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఇందుకోసం టీమ్ఇండియా ఆటగాళ్లు విడతల వారిగా అక్కడకు చేరుకుంటున్నారు. అదే సమయంలో భారత జట్టును గాయాల బెడద వీడడం లేదు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ జట్టుకు ఆడుతున్న ఇషాన్ కిషన్ గాయపడ్డాడు. ఐపీఎల్ 2023లో భాగంగా క్వాలిఫయర్2లో శుక్రవారం గుజరాత్ టైటాన్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి.
ఈ మ్యాచ్లో ముంబై తరుపున ఆడుతున్న ఇషాన్ కిషన్ కంటికి గాయమైంది. గుజరాత్ ఇన్నింగ్స్ 17వ ఓవర్ ప్రారంభ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కీపింగ్ చేస్తున్న ఇషాన్ కిషన్ స్ట్రైకింగ్ ఎండ్కు వెలుతుండగా బౌలర్ క్రిస్ జోర్డాన్ తన తలపై ఉన్న క్యాప్ను సరిచేసుకునేందుకు చేయి పైకి ఎత్తాడు. ఆ సమయంలో జోర్డాన్ చేయి పొరబాటున ఇషాన్ కిషన్ కంటిని బలంగా తాకింది.
WTC Final 2023: డబ్ల్యూటీసీ ఫైనల్ గెలిస్తే ఎంతిస్తారంటే..?
దీంతో ఇషాన్ నొప్పితో విలవిలలాడాడు. ఫిజియో వచ్చినప్పటికీ లాభం లేకపోయింది. దీంతో వెంటనే ఇషాన్ మైదానాన్ని వీడాడు. మళ్లీ వెనక్కి రాలేదు. కనీసం బ్యాటింగ్ కూడా చేయలేదు. అతడి స్థానంలో కంకషన్ సబ్స్ట్యూట్గా విష్ణు వినోద్ ఆడాడు. అనుకోని ఈ ఘటనపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అప్రమత్తమైంది. అతడికి అయిన గాయంపై ఆరా తీస్తోంది.
రాహుల్ స్థానంలో చోటిస్తే..
డబ్ల్యూటీసీ ఫైనల్కు ఎంపిక చేసిన భారత జట్టులో తొలుత ఇషాన్ కిషన్కు స్థానం దక్కలేదు. అయితే కేఎల్ రాహుల్ ఐపీఎల్లో గాయపడడంతో అతడి స్థానంలో ఇషాన్ కు అవకాశం లభించింది. అయితే.. ఇప్పుడు ఇతడు గాయపడ్డాడు. మరో నాలుగైదు రోజుల్లో ఇంగ్లాండ్కు వెళ్లాల్సిన ఈ సమయంలో ఇషాన్ గాయపడడం టీమ్ఇండియాకు ఎదురుదెబ్బే. అతడి స్థానంలో వేరే ఆటగాడిని ఎంపిక చేయాలా..? వద్దా అన్న విషయాలను బీసీసీఐ పరిశీలిస్తోంది. అయితే.. అతడికి అయిన గాయంపై పూర్తి స్పష్టత వచ్చిన తరువాతనే తుది నిర్ణయం తీసుకోవాలని బావిస్తోంది.
WTC final: ఆస్ట్రేలియా కొత్త జెర్సీని చూశారా..? టీమ్ఇండియాతో మ్యాచ్ కోసమేనట
ఫిట్నెస్ సాధించిన అశ్విన్
ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్కు ఆడిన అశ్విన్.. ఆర్ఆర్ ఆడిన ఆఖరి లీగ్ మ్యాచ్కు దూరం అయ్యాడు. వెన్ను నొప్పి కారణంగా అతడు అందుబాటులో లేకుండా పోయాడని సంజు శాంసన్ చెప్పాడు. దీంతో డబ్ల్యూటీసీ ఫైనల్కు అశ్విన్ ఆడుతాడో లేదోనన్న సందేహాలు అందరిలో నెలకొన్నాయి. అయితే.. అశ్విన్ పూర్తి ఫిట్నెస్ సాధించినట్లు సమాచారం. లండన్కు వెళ్లిన అతడు ఫైనల్ మ్యాచ్ కోసం ప్రాక్టీస్ను మొదలెట్టేశాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్స్ భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, ఛతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్)
స్టాండ్బై ఆటగాళ్లు: రుతురాజ్ గైక్వాడ్, ముఖేష్ కుమార్, సూర్యకుమార్ యాదవ్
WTC Final 2023: యువ ఆటగాడికి బంఫర్ ఆఫర్.. గాయపడిన కేఎల్ రాహుల్ స్థానంలో ఛాన్స్