Revanth Reddy – Kishan Reddy : బీఆర్ఎస్, బీజేపీ నేతలపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ మారి మూసీ చైర్మన్ అయ్యారని, ప్రజలను మూసీలో ముంచారని మండిపడ్డారు. తెలంగాణ ప్రభుత్వ వరద సాయం చెయ్యాలని, ప్రజలను ఆదుకోవాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిన్న కాంగ్రెస్ పార్టీ జీహెచ్ఎంసీ ముట్టడి చేసిందన్నారు. గతంలో రూ.600 కోట్లు వరద సాయం చేశామని చెప్పి సగం దోచుకున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. వరల్లో చనిపోయిన కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవాలని, ప్రతి ఎకరానికి 30వేల సాయం చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
”ఇసుక మేటలు తొలగించడానికి రూ.20వేల సాయం చెయ్యాలి. అడ్డా మీద కూలీలను గుర్తించి సాయం చెయ్యాలి. అన్ని రకాల సహాయక చర్యలు చేపట్టాలి. చనిపోయిన కుటుంబాలను పరామర్శించడానికి ఇప్పటివరకు ఎవరూ రాలేదు. కాంగ్రెస్ నేతలు, క్యాడర్ వెళ్లి పరామర్శించాలి. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎక్కడున్నారో తెలీదు. వరదల్లో కొట్టుకొని పోయినట్లున్నారు.
వారికీ సోమవారం పిండ ప్రదానం చెయ్యాలని కోరుతున్నా. కేంద్ర సాయం కూడా వెంటనే విడుదల చెయ్యాలి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెంటనే రూ.1000 కోట్లు తీసుకురావాలి. కుమ్మక్కు రాజకీయాలు చెల్లవు. నగరంలో చెరువులు ఆక్రమణకు గురయ్యాయి. కాలనీలు మునుగుతున్నాయి. రాష్ట్రంలోని జిల్లాలే కాదు హైదరాబాద్ నగరం ఆగమైంది. నగరం మేడిపండులా ఉంది. నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడి ఇవాంకను తీసుకొచ్చారు. ఐఎండీ హెచ్చరించినా సర్కార్ అలర్ట్ కాలేదు. మంత్రులను, అధికారులను అప్రమత్తం చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారు. కండువాలు మార్చడానికి వేదికగా ప్రగతి భవన్ మారింది. సమీక్ష లేదు ప్రగతి లేదు.
Also Read..Khanapur Constituency: ఖానాపూర్ బీఆర్ఎస్ టిక్కెట్ కు బహుముఖ పోటీ.. ఎవరికి దక్కేనో?
పేపర్ లో ప్రకటనలు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. దోపిడీ సొమ్ము దొరలపాలైంది. చిన్న దొర బర్త్ డేకు పేపర్ లో, టీవీలో యాడ్స్ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ డెవలప్ మెంట్ కోసమే” అని రేవంత్ రెడ్డి అన్నారు.