Rahul Gandhi ప్రజాధనంతో గత ప్రభుత్వాలు 70 ఏళ్లుగా నిర్మించిన ప్రతిష్టాత్మక ఆస్తులను తెగనమ్మే ప్రక్రియను మోదీ సర్కార్ చేపట్టిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. గత 70ఏళ్లుగా దేశంలో ఏలాంటి అభివృద్ధి జరగలేదని బీజేపీ, నరేంద్ర మోదీ ఆరోపిస్తుంటారని..కానీ గత 70ఏళ్లుగా కూడబెట్టుకున్న ఆస్తులను జాతీయ మానిటైజేషన్ పైప్లైన్ పేరుతో కేంద్రం అమ్మేస్తోందని రాహుల్ అన్నారు. ప్రభుత్వ ఆస్తులను కేవలం 3-4 పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అమ్ముతోందని రాహుల్ విమర్శించారు. కేంద్రం ప్రభుత్వ ప్రైవేటీకరణ ప్రణాళికలు సంఘటిత రంగంలో గుత్తాధిపత్యానికి దారితీస్తుందని..ఇదే జరిగితే ఎవరికీ ఉద్యోగాలు ఉండవని విమర్శించారు.
దేశంలో నిధుల సమీకరణ కోసం జాతీయ మానిటైజేషన్ పైప్లైన్(NMP)ని సోమవారం నిర్మలాసీతారామన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దేశంలో మౌలిక వసతుల అభివృద్ధికి నిధుల సమీకరణలో భాగంగా రానున్న నాలుగేళ్లలో ఈ కార్యక్రమం కింద 6 లక్షల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం సమీకరించనుంది. రైల్వే, రోడ్లు, విద్యుత్ రంగాల్లో ఆస్తులను నిర్దిష్ట కాలానికి విక్రయించడం ద్వారా ఈ నిధుల సమీకరణ చేస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
ఈ నేపథ్యంలో ఇవాళ ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్ గాంధీ..మోదీ ప్రభుత్వంపై మండిపడ్డారు. 70ఏళ్లుగా కూడబెట్టుకుంటున్న ఆస్తులను ఎలా అమ్మేస్తారని ప్రశ్నించారు. అసంఘటిత రంగాన్ని అంతం చేయాలని ప్రభుత్వం చూస్తోందన్నారు. జాతీయ మానెటైజేషన్ పైప్లైన్ ద్వారా మోదీ ప్రభుత్వం తన పారిశ్రామిక స్నేహితులకు లబ్ధి చేకూర్చేందుకు ప్రయత్నిస్తోందని రాహుల్ విమర్శించారు. తాము ప్రైవేటీకరణకు వ్యతిరేకం కాదని కానీ మన ప్రైవేటీకరణ ప్లాన్ కి ఒక లాజిక్ ఉండాలన్నారు. రైల్వేల వంటి వ్యూహాత్మక ఆస్తుల ప్రైవేటీకరణ సరైంది కాదన్నారు. కేంద్ర ప్రభుత్వం సంఘటిత రంగంలో ఏకస్వామ్యాన్ని సృష్టిస్తూ మరోవైపు అసంఘటిత రంగాన్ని ధ్వంసం చేసేలా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు.
రాహుల్ గాంధీతో పాటు మీడియా సమావేశంలో పాల్గొన్న మరో కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం.. ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. నిధుల సేకరణ పేరుతో ఆస్తులను అమ్మకూడదన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత వాటాదారులు, ఉద్యోగులు, యూనియన్లు, రైతులను సంప్రదించాలని చిదంబరం పేర్కొన్నారు.