Ready To Touch Centre Feet : దేశంలో కరోనా సెకండ్వేవ్ దాదాపు అన్ని రాష్ట్రాల్లో విస్పోటనం సృష్టిస్తోంది. దేశంలో నెలకొన్న కరోనా సంక్షోభాన్ని ఆక్సిజన్ కొరత మరింత తీవ్రతరం చేస్తోంది. ప్రాణవాయువు దొరక్క ఆక్సిజన్ అవసరం ఉన్న అన్ని రకాల రోగులు అల్లాడుతున్నారు. మెడికల్ ఆక్సిజన్ను వెంటనే పంపాలంటూ వివిధ రాష్ర్టాల సీఎంలు, మంత్రులు, ఇతర నేతలు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు. ఆక్సిజన్ కోసం కేంద్రం కాళ్లు కూడా పట్టుకోవడానికి సిద్ధమేనని మహారాష్ట్ర మంత్రి రాజేశ్ తోపే చెప్పడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
దేశ రాజధాని ఢిల్లీలో పరిస్థితులు రోజురోజుకు దిగజారుతున్నాయి.. సర్ గంగారం ఆసుపత్రిలో పరిస్థితులు ప్రమాదకరంగా మారాయి… ఈ ఆసుపత్రిలో 25 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. మరో 60 మంది కరోనా బాధితుల జీవితాలు ఇప్పుడు ప్రమాదంలో పడ్డాయి. ప్రస్తుతం ఈ ఆసుపత్రిలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అయిపోయాయి.. సరిపడా ఆక్సిజన్ నిల్వ లేదని ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది.
ప్రస్తుతం ఆసుపత్రిలో వెంటిలేటర్లు సమర్థంగా పనిచేయడం లేదని.. అత్యవసరంగా ఆక్సిజన్ తరలించాలని కోరారు.. దీంతో వెంటనే స్పందించిన కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ను పంపించింది. అటు మ్యాక్స్ హాస్పిటల్, సాకేత్ ఆస్పత్రికి కూడా కేంద్రం మెడికల్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ చేసింది. అయితే కేంద్రం సరఫరా చేసిన ఆక్సిజన్ ప్రస్తుతమున్న కరోనా పేషెంట్లకే సరిపోతుందని మ్యాక్స్ యాజమాన్యం ప్రకటించింది. కరోనాతో ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఎవరిని అడ్మిట్ చేసుకోమని తేల్చేసింది.