Governor Tamilisai Soundararajan : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ అంశంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ నేతలు. ఈ సందర్భంగా టీ కాంగ్రెస్ నేతలతో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు గవర్నర్ తమిళిసై. టీఎస్ పీఎస్ సీ పేపర్ లీకేజీ పెద్ద ఇష్యూ అని, సీరియస్ గా తీసుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారు. ఇది లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన అంశం అన్నారామె.
లీకేజీపై ప్రతిరోజూ ప్రభుత్వం, ప్రతిపక్షం చేస్తున్న కామెంట్లు చూస్తున్నానని అన్నారు గవర్నర్ తమిళిసై. ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కామెంట్స్ ను రెగులర్ గా ఫాలో అవుతున్నానని గవర్నర్ చెప్పారు. పేపర్ లీక్ పై యాక్షన్ తీసుకోవాలని గవర్నర్ ను కోరారు రేవంత్ రెడ్డి. టీఎస్ పీఎస్ సీపై పూర్తి అధికారం గవర్నర్ కు ఉందని, విచారణ సరైన మార్గంలో నడిచేలా చూడాలన్నారు. ఈ విషయంపై కోర్టులో పిటీషన్ వేసిన విషయాన్ని గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు రేవంత్ రెడ్డి.(Governor Tamilisai Soundararajan)
”తీవ్ర నిరాశకు లోనైన కొందరు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి తెలంగాణలో ఉంది. అందుకే, విద్యార్థులకు వ్యవస్థల మీద నమ్మకం కలిగించడానికే, గవర్నర్ వ్యవస్థ ద్వారా తక్షణమే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో జరిగిన అవకతవకలకు సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదులో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి.
ఒకటి.. ఐటీ మంత్రి కేటీఆర్ శాఖలోనే వాళ్ల నియంత్రణలో ఉండే కంప్యూటర్లు నిర్వహణ ఐటీ మంత్రి కిందకే వస్తుంది. ఆయన శాఖకు సంబంధించిన ఉద్యోగులే ఈ పేపర్ లీక్ అంశంలో క్రియాశీలక పాత్ర పోషించారు. కంప్యూటర్ లో భద్రంగా నిక్షిప్తమై ఉన్న గ్రూప్ 1 క్వశ్చన్ పేపర్ లీక్ కావడం దారుణం. దీనిపై గవర్నర్ కు ఫిర్యాదు చేశాము. చర్యలు తీసుకోవాలని కోరాము” అని రేవంత్ రెడ్డి తెలిపారు.(Governor Tamilisai Soundararajan)
టీఎస్ పీఎస్ సీ క్వశ్చన్ పేపర్ లీక్ అంశాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఈ అంశంపై ఒకవైపు న్యాయపోరాటం చేస్తున్నారు. మరోవైపు ప్రజల్లోకి వెళ్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ పోరాటాన్ని ఉధృతం చేశారు కాంగ్రెస్ నేతలు. ఇందులో భాగంగానే ఇప్పుడు గవర్నర్ ని కలిసి ఫిర్యాదు చేశారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం గవర్నర్ ను ప్రత్యేకంగా కలిసింది. క్వశ్చన్ పేపర్ లీక్ అంశంపై ఫిర్యాదు చేసింది. గవర్నర్ కు విశేష అధికారాలు ఉంటాయి కాబట్టి కచ్చితంగా ఈ అంశంపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరారు కాంగ్రెస్ నేతలు.