Lukewarm Water : మనిషికి నీరు ప్రాణాధారం. శరీరంలో జీవక్రియలకు నీరు ఎంతో అవసరం. చాలా మంది నిద్రలేచిన వెంటనే టీ,కాఫీలు తాగేందుకు ఇష్టపడుతుంటారు. వాస్తవానికి నిద్రలేచిన వెంటనే పరగడుపున గోరు వెచ్చని నీళ్ళను తాగటం ఎంతో మంచిది. దీని వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. నిద్రలేచిన వెంటనే 2గ్లాసుల గోరు వెచ్చని నీళ్ళను తాగటం వల్ల ప్రయోజనాల గురించి తెలుసుకుందాం..
గోరు వెచ్చని నీళ్ళను ఉదయాన్నే తాగడం వల్ల నొప్పులు దూరమవుతాయి. ప్రధానంగా చాలా మంది కండారాలు, ఒళ్ళు నొప్పులతో బాధపడుతుంటారు. అలాంటి వారు గోరవెచ్చని నీటిని తాగటం ద్వారా నొప్పులు తగ్గిపోతాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్ధ శుభ్రపడుతుంది. మలబద్ధకం సమస్య ఉన్నవారికి గోరు వెచ్చని నీరు తాగటం వల్ల సుఖ విరేచనం అవుతుంది.
శరీరంలో ఉండే వ్యర్ధాలు, విషపదార్ధాలు బయటకు వెళ్ళటం ద్వారా జీర్ణ ప్రక్రియ పనితీరు మెరుగుపడుతుంది. గ్యాస్ వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. శరీరంలో రక్త సరఫరాను మెరుగు పరచటంలో గోరు వెచ్చని నీరు ఉపకరిస్తుంది. రక్తపోటు వంటి సమస్యలు తగ్గుతాయి. శిరోజాలకు రక్తప్రసరణ బాగా జరిగి కుదుళ్ళు ధృడంగా మారటంతోపాటు ఆరోగ్యంగా ఉంటాయి.
డయాబెటీస్, గుండె, ఉదర సంబంధిత వ్యాధులతో బాధపడేవారు గోరు వెచ్చని నీళ్ళను తాగటం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గొంతు సమస్యలను గోరు వెచ్చని నీటిని తీసుకోవటం ద్వారా చెక్ చెప్పవచ్చు. ఊబకాయం, అధిక బరువును తగ్గించుకోవటానికి, జలుబు, న్యూమోనియా నుండి రక్షించుకోవటానికి వేడినీళ్ళు తాగటం మంచిది. వేడి నీళ్ళు తాగమన్నారు కదా అని మరీ మరిగిపోతున్న నీటిని తాగితే సమస్యలను కొనితెచ్చుకోవాల్సి ఉంటుంది. గోరు వెచ్చని నీటిని తాగాలన్న విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.