Madras Highcourt issues stay on Vishal Mark Antony Movie Release
Mark Antony Movie : హీరో విశాల్(Vishal) త్వరలో ‘మార్క్ ఆంటోనీ’ అనే పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా, సరికొత్త కాన్సెప్ట్ తో ఈ మూవీ రూపొందుతోంది. ఈ సినిమాలో విశాల్ కి జోడీగా రీతూ వర్మ నటిస్తోంది. ఎస్.జె.సూర్య, సునీల్, సెల్వ రాఘవన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన మార్క్ ఆంటోనీ సెప్టెంబర్ 15న రిలీజ్ కానుంది.
అయితే విశాల్ మార్క్ ఆంటోనీ సినిమా రిలీజ్ ఆపాలని మద్రాస్ హైకోర్టు స్టే ఇచ్చింది. విశాల్ ప్రస్తుతం అన్ని సినిమాలు తన సొంత నిర్మాణ సంస్థలోనే చేస్తున్నాడు. అయితే గతంలో 22 కోట్లకు పైగా ఒకరి దగ్గరి నుంచి అప్పు తీసుకున్నాడు విశాల్. అది చెల్లించకపోవడంతో వాళ్ళు కోర్టుకి వెళ్లగా తమిళ అగ్ర నిర్మాణ సంస్థ అయినా లైకాకు తన రాబోయే సినిమాల థియేట్రికల్ రైట్స్ ఇస్తానని లేదా డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకొని విశాల్ అప్పుని లైకా సంస్థతో కట్టించాడు.
అయితే ఇది జరిగి చాలా నెలలు అవుతుంది. ఇప్పటికి విశాల్ లైకా వాళ్లకు అప్పు తీర్చలేదు. అంతే కాకుండా మార్క్ ఆంటోనీ సినిమా థియేట్రికల్ హక్కులు కూడా వేరే వాళ్ళకి ఇవ్వడంతో లైకా నిర్మాణ సంస్థ హైకోర్టుని ఆశ్రయించింది. కేసు విచారించిన హైకోర్టు మొదట 15 కోట్లు కట్టమని ఒక డేట్ ఇచ్చినా విశాల్ కట్టకపోవడంతో ఇప్పుడు మరో విచారణలో సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చింది. సినిమా రిలీజ్ పై స్టే ఇచ్చి విశాల్ ని 12వ తారీఖు కోర్టుకు విచారణకు హాజరు కావాలని తెలిపింది.
మరి విశాల్ డబ్బులు కడతాడా, లైకా వాళ్ళతో మాట్లాడతాడా, సినిమా రిలీజ్ అవుతుందా చూడాలి. అయితే విశాల్ మాత్రం ఇప్పటివరకు దీనిపై స్పందించలేదు.