Delhi CM Arvind Kejriwal: గుజరాత్లో యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) తీసుకురావడానికి ఒక ప్యానెల్ను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఒకరోజు తర్వాత ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న కేజ్రీవాల్.. ఆదివారం రాజ్కోట్ జిల్లాలోని ధోరాజీలో ర్యాలీలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
Arvind Kejriwal: గుజరాత్లో కేజ్రీవాల్కు చేదు అనుభవం.. వీడియో వైరల్
రాజ్యాంగంలోని ఆర్టికల్ 44లో యూనిఫాం సివిల్ కోడ్ను రూపొందించడం ప్రభుత్వ బాధ్యత అని స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి ప్రభుత్వం యూసీసీని రూపొందించాలి. అన్నివర్గాల అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా ఇది చేయాలని కేజ్రీవాల్ అన్నారు. బీజేపీ ఏం చేసింది? ఉత్తరాఖండ్ ఎన్నికలకు ముందు వారు ఒక ప్యానెల్ తయారు చేశారు. అక్కడ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత కమిటీ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు. ఇప్పుడు గుజరాత్ ఎన్నికలకు ముందు, ఒక ప్యానెల్ ఏర్పాటు చేయబడింది, అదికూడా ఎన్నికలు ముగిసిన తర్వాత ఇంటికి వెళ్తుంది అంటూ కేజ్రీవాల్ విమర్శించారు.
బీజేపీ అధికారంలో ఉన్న మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లో ఎందుకు చేయరు అని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం నిజంగా యూసీసీని దేశవ్యాప్తంగా అమలు చేయాలని భావిస్తే జాతీయ స్థాయిలో ఎందుకు చేయకూడదు? వారు లోక్సభ ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారా అంటూ కేజ్రీవాల్ ప్రశ్నించారు.