smog tower in delhi: రోజు రోజుకూ ఢిల్లీలో భారీస్థాయిలో గాలి కాలుష్యం పెరుగుతున్న విషయం తెలిసిందే. ఎయిర్ పొల్యూషన్ సమస్యను అధిగమించేందుకు కేజ్రీ సర్కార్ ఓ కొత్త ప్లాన్ వేసింది. కన్నాట్ ప్లేస్ ఏరియలో కొత్తగా స్మాగ్ టవర్ను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది.
సుమారు 20 కోట్ల ఖర్చుతో స్మాగ్ టవర్ను నిర్మించే ప్రతిపాదనకు ఢిల్లీ కేబినెట్ ఆమోదం తెలిపిందని ఇవాళ(అక్టోబర్-9,2020) సీఎం కేజ్రీవాల్ చెప్పారు. మరో 10నెలల్లోనే ఈ టవర్ అందుబాటులోకి వస్తుందని ఆయన తెలిపారు.గాలిలో ఉన్న కాలుష్యాన్ని పీల్చే స్మాగ్ టవర్లు.. ఆ తర్వాత స్వచ్ఛమైన గాలిని విడుదల చేస్తాయని సీఎం చెప్పారు. కాగా, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తమ నిధులతో ఆనంద్ విహార్ ప్రాంతంలో స్మాగ్ టవర్ను నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కన్నాట్ ప్లేస్ లో కేజ్రీ ప్రభుత్వం మరో స్మాగ్ టవర్ ను ఏర్పాటుచేస్తోంది.
మరోవైపు, క్లీన్ ఢిల్లీలో భాగంగా ఢిల్లీలో చెట్లను కాపాడేందుకు ట్రీ ప్లాంటేషన్ పాలసీకి కూడా కేబినెట్ ఆమోదముద్ర వేసినట్లు కేజ్రీవాల్ చెప్పారు. ఢిల్లీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ పాలసీలో భాగంగా ఏదైనా నిర్మాణానికి లేదా డెవలప్మెంట్ ప్రాజెక్టుల కోసం ఒకవేళ చెట్ల నరికివేత కొనసాగితే, దాంట్లో కనీసం 80 శాతం వృక్షాలను మరోచోట తప్పనిసరిగా నాటాలి. 80 శాతం నాటబడిన చెట్లు బతికితేనే ట్రాన్స్ప్లాంటేషన్ ఏజెన్సీకి పేమెంట్ ఇస్తామని కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
జాతీయ స్థాయిలో ట్రాన్స్ ప్లాంటేషన్ ఏజెన్సీలను ఏర్పాటు చేసేందుకు ప్యానల్ ను నియమిస్తున్నట్లు సీఎం చెప్పారు. అంతేకాకుండా కొత్త పాలసీ కింద.. ఓ డెడికేటెడ్ ట్రీ ప్లాంటేషన్ సెల్ ను కూడా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. RWA సభ్యులున్న స్థానిక కమిటీలు,నివాసితులు నాటబడిన చెట్లను మానిటర్ చేస్తారని కేజ్రీవాల్ తెలిపారు.