Supreme Court : సీల్డ్ కవర్లపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించంది. సీల్డ్ కవర్లపై ఉన్నత న్యాయస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఆర్ఓపీ కేసు విచారణ సందర్భంగా ఇకపై సీల్డ్ కవర్లను ఆపేద్దామని వ్యాఖ్యానించింది. అర్హులైన మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ బకాయిల చెల్లింపు విషయంలో తమ అభిప్రాయాలను సీల్డ్ కవర్ లో సమర్పించడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
తాను వ్యక్తిగతంగా సీల్డ్ కవర్ కు వ్యతిరేకమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. న్యాయస్థానాల్లో పారదర్శకత ఉండాలని తెలిపారు. ఈ కేసులో రహస్యం ఏముందని ప్రశ్నించారు. తాము ఇచ్చిన ఆదేశాలు అమలు చేస్తున్నారు.. అంతేకదా అని అన్నారు. ఇకపై ఎటువంటి రహస్య పత్రాలు, సీల్డ్ కవర్లు తీసుకోబోమని స్పష్టం చేశారు. ఈ సంప్రదాయాన్ని సుప్రీంకోర్టు అనుసరిస్తే హైకోర్టులు అదే బాటలో పయనిస్తాయని పేర్కొన్నారు.
ఓఆర్వోపీ బకాయిల చెల్లింపులపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఏప్రిల్ 30లోగా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, అవార్డులు గెలుచుకున్న వారికి ఒకే ఇన్ స్టాల్ మెంట్ లో బకాయిలు చెల్లించాలని కేంద్రాన్ని ఆదేశించింది. జూన్ 30 నాటికి 70 ఏళ్లకు పైబడిన పెన్షనర్లకు, మిగతా అర్హులైన పెన్షనర్లకు మూడు వాయిదాల్లో ఫిబ్రవరి28, 2024 నాటికి ఆ మొత్తాన్ని చెల్లించాలని తీర్పు ఇచ్చింది.