BRS Foundation Day : గులాబీ పార్టీకి 23ఏళ్లు.. ఈసారి నిరాడంబరంగా పార్టీ ఆవిర్భావ వేడుకలు

బీఆర్ఎస్ వ్యవస్థాపక దినత్సవం సందర్భంగా అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు.

BRS Chief KCR : తెలంగాణ రాష్ట్ర సాధ‌న ల‌క్ష్యంగా ఏర్పాటైన భారత రాష్ట్ర స‌మితి పార్టీ ఆవిర్భవించి 23 ఏళ్లు అవుతుంది. ప్రతిఏటా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం గులాబీ పార్టీకి ఆనవాయితీగా వస్తుంది. కానీ, వివిధ కారణాలతో మూడేళ్లుగా పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజు ప్లీనరీని నిర్వహించలేకపోతుంది గులాబీ పార్టీ. ఈ సారి కూడా ప్లీనరీ నిర్వహణపై ఎన్నికల కోడ్ ప్రభావం పడింది. పార్లమెంట్ ఎన్నికల కోడ్ కారణంగా ప్లీనరీ నిర్వహణకు పార్టీ బ్రేక్ వేయాల్సి వచ్చింది. 2019లో కూడా పార్లమెంట్ ఎన్నికల కోడ్‌తో ప్లీనరీని నిర్వహించలేక పోయింది. ఆ తర్వాత కరోనా ప్రభావంతో వరుసగా రెండేళ్లు ప్లీనరీ నిర్వహించడం సాధ్యం కాలేదు. ప్రతి ఏటా ప్లీనరీ పేరుతో ప్రతినిధుల స‌భ‌, తర్వాత బ‌హిరంగ స‌భ‌ను నిర్వహించే ఆనవాయితీ ఉన్నా.. మూడేళ్లుగా వివిధ కార‌ణాల‌తో సాధ్యం కావ‌డం లేదు.

Also Read : Kcr : నేను గెలిస్తే ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షలు వస్తాయన్నారు మోదీ.. మరి వచ్చాయా?- కేసీఆర్ ఫైర్

తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలన్న లక్ష్యంగా 23 ఏళ్ల క్రితం..జలదృశ్యం వేదికగా 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితిని మొదలుపెట్టారు కేసీఆర్. అప్పటినుంచి గులాబీ పార్టీగా తెలంగాణ ప్రజల మధ్య నిరంతరం ఉండే విధంగా కేసీఆర్ కార్యాచరణ అమలు చేస్తూ వచ్చారు. దాదాపు 12 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు. ఈ సమయంలో పార్టీ ఎన్నో ఎత్తు పల్లాలను చూడాల్సి వచ్చింది. అయినా రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ నినాదాన్ని అందుకోగా తప్పని పరిస్థితిని సృష్టించారు గులాబీబాస్.

Also Read : Kishan Reddy : తెలంగాణలో బీసీల రిజర్వేషన్లకు గండి కొడుతున్నది ఎవరో సీఎం రేవంత్ చెప్పాలి : కిషన్ రెడ్డి

2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత… రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌కు ప్రజలు పట్టం కట్టబెట్టారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కూడా రెండోసారి కేసీఆర్‌కే అధికారం ఇచ్చారు. రాష్ట్రంలో గులాబీ పార్టీకి తిరుగులేదని భావించిన కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు. జాతీయ స్థాయిలో పార్టీ కమిటీలను నియమించారు. పొరుగు రాష్ట్రాల్లో సభ్యత్వ నమోదును మొదలుపెట్టి రాజకీయంగా అక్కడ గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ, అనూహ్యంగా రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ రాష్ట్రానికే పరిమితం కాక తప్పలేదు.

బీఆర్ఎస్ ఆవిర్భావ దినత్సవం సందర్భంగా అన్ని జిల్లాల పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్ లో శనివారం ఉదయం 9గంటలకు ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించనున్నారు. జిల్లా పార్టీ కార్యవర్గాలు, ప్రజాప్రతినిధులు, పార్టీ సభ్యులు జిల్లా పార్టీ కార్యాలయాల్లో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనాలని సూచించారు.

 

ట్రెండింగ్ వార్తలు