Rohit Sharma fined
Rohit Sharma fined : టీమ్ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కారు గంటకు 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించినట్లు బుధవారం సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. దీనిలో ఎటువంటి నిజం లేదని హైవే పోలీసులు తెలిపారు. అయితే.. రహదారి నిబంధనలు ఉల్లంఘించిన మాట వాస్తవమేనని వారు తెలిపారు. రోహిత్ కారు గంటకు 105, 117 కి.మీ వేగంతో ప్రయాణించినట్లు తెలిపారు. హైవే పై స్పీడ్ లిమిట్ గంటకు 100 కి.మీ కావడంతో రోహిత్కు జరిమానా విధించినట్లు చెప్పారు.
రెండు సార్లు ఓవర్ స్పీడ్గా వెళ్లినట్లు గుర్తించడంతో ఒక్కొ తప్పిదానికి రూ.2000 చొప్పున మొత్తం రూ.4000 జరిమానా విధించారు. ‘రోహిత్ శర్మ కారు అక్టోబర్ 17న ముంబై-పుణె హైవే పై అతి వేగంతో వెళ్లింది. హైవే పై అమర్చిన కెమెరాల ద్వారా రెండు సందర్భాల్లో అతి వేగంగా వెళ్లినట్లు గుర్తించాం. 200 కి.మీ కంటే ఎక్కువ వేగంతో వెళ్లినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదు. మొదటి సారి గరిష్టంగా 117 కి.మీ వేగంతో వెళ్లింది. అదే రోజు తిరుగు ప్రయాణంలో మరోసారి కారు నిబంధనలు ఉల్లంఘించింది. ఈ సారి 105 కి.మీ వేగంతో వెళ్లింది. హైవేపై ఇరువైపులా ఉన్న కెమెరాల్లో అతడి కారు ఫోటోలు కూడా నమోదు అయ్యాయి. ఈ రెండు ఉల్లంఘనలకు జరిమానా విధించాం. గురువారం రోహిత్ ఫైన్ను కట్టాడు.’ అని తెలిపారు.
ఇదిలా ఉంటే.. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు వన్డే ప్రపంచకప్లో విజయాలతో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచుల్లో విజయాలు సాధించింది. పాయింట్ల పట్టికలో రెండవ స్థానంలో కొనసాగుతోంది. దాదాపు 12 ఏళ్ల తరువాత స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో టీమ్ఇండియా విజేతగా నిలవాలని అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్లో భారత జట్టు తన తదుపరి మ్యాచ్లో న్యూజిలాండ్తో ఆడనుంది.