PAK-W vs SL-W : శ్రీలంక వేదికగా జరుగుతున్న మహిళల ఆసియా కప్ 2024 ఆఖరి అంకానికి చేరుకుంది. ఉత్కంఠ పోరులో పాకిస్తాన్ పై విజయం సాధించి ఆతిథ్య శ్రీలంక జట్టు ఫైనల్కు చేరుకుంది. శుక్రవారం హోరాహోరీగా సాగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్లో లంక జట్టు మూడు వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.
ఈ మ్యాచ్లో పాకిస్తాన్ జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. పాక్ బ్యాటర్లలో మునీబా అలీ (37), గుల్ ఫెరోజా (25) లు రాణించారు. లంక బౌలర్లలో కవిషా దిల్హరి, ప్రభోదని లు చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యాన్ని శ్రీలంక 19.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి అందుకుంది. లంక బ్యాటర్లలో కెప్టెన్ చమరి ఆటపట్టు (63; 48 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో మెరిసింది. పాక్ బౌలర్లో సదియా ఇక్బాల్ నాలుగు వికెట్లు పడగొట్టింది.
ఆఖరి ఓవర్లో హైడ్రామా..
ఆఖరి రెండు ఓవర్లలో శ్రీలంక విజయానికి 12 బంతుల్లో 16 పరుగులు కావల్సి ఉంది. చేతిలో నాలుగు వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఈ దశలో 19 ఓవర్లో పాకిస్తాన్ బౌలర్ నష్రా సంధు 13 పరుగులు ఇచ్చింది. దీంతో లంక విజయ సమీకరణం ఆరు బంతుల్లో మూడు పరుగులుగా మారింది.
అయితే.. ఆఖరి ఓవర్ను పాక్ కెప్టెన్ నిదా దర్ వేసింది. తొలి బంతిని డాల్ బాల్ గా వేయగా రెండో బంతికి సుగంధిక కుమారి (10) ని ఔట్ చేసింది. ఇక మూడో బంతి కూడా డాట్గా వేయడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. నాలుగో బంతికి అచిని కులసూర్య సింగిల్ తీసింది. ఐదో బంతికి నిదా వైడ్ వేయడంతో ఇరు జట్ల స్కోరు సమమైంది. ఐదో బంతికి సంజీవని సింగిల్ తీయడంతో లంక విజయసంబురాల్లో ముగినిపోయింది.
ఇక ఆదివారం జరిగే ఫైనల్ మ్యాచులో టీమ్ఇండియాతో శ్రీలంక తలపడనుంది. మహిళల ఆసియా కప్ 2024లో పాక్ ప్రయాణం ముగియడంతో నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. అరెరే.. భారత్ వర్సెస్ పాక్ ఫైనల్ మ్యాచ్ చూద్దామనుకుంటే ఇలా అయ్యిందేమిటీ..? అంటూ కామెంట్లు చేస్తున్నారు.