Godavari Flood Surge Continues : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ క్రమంగా పెరుగుతోంది. ఈ ఉదయం 50.4 అడుగుల వద్ద ప్రవహించిన గోదావరి ప్రస్తుతం 50.8 అడుగుల వద్ద ప్రవహిస్తోంది. మూడు రోజుల నుంచి రెండు అడుగుల మేర తగ్గిన గోదావరి మళ్లీ క్రమంగా పెరుగుతోంది. 5 రోజుల నుంచి గోదావరి నీటిమట్టం 50 అడుగులకు తగ్గకపోవడంతో స్థానికుల్లో భయాందోళన నెలకొంది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. 20 రోజుల క్రితం గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ప్రజలు సర్వస్వం కోల్పోయారు. ఇప్పడిప్పుడే కోలుకుంటున్న పరిస్థితి ఉంది. ఇంతలోనే గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చడంతో ఆ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
ఎగువున కురుస్తున్న భారీ వర్షాలతో పాటు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి నాగార్జున సాగర్ కు పెద్దఎత్తున వరద పోటెత్తుతోంది. సాగర్ అన్ని గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్ట్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, 584 అడుగులకు నీటి నిల్వ చేరుకుంది. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 3 లక్షల 80వేల క్యూసెక్కుల వరద రావడంతో కుడి, ఎడమ కాల్వ క్రస్ట్ గేట్ల ద్వారా 3లక్షల 12వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.