New Credit Card Rules : మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నారా? వచ్చే ఏప్రిల్ 1, 2024 నుంచి క్రెడిట్ కార్డులపై కొత్త రూల్స్ అమల్లోకి రానున్నాయి. ప్రత్యేకించి కొన్ని బ్యాంకు క్రెడిట్ కార్డుల్లో ఈ కొత్త మార్పులు వర్తించనున్నాయి. ముఖ్యంగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఎస్ బ్యాంక్ బ్యాంకుల్లో ఈ కొత్త మార్పులు చోటుచేసుకోనున్నాయి. రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్ కు సంబంధించి నిబంధనలు వర్తించనున్నాయి. బ్యాంకుల వారీగా ఏయే మార్పులు ఉండనున్నాయో ఓసారి పరిశీలిద్దాం.
ఎస్బీఐ కార్డు :
ఎస్బీఐ క్రెడిట్ కార్డుదారులకు రివార్డ్ పాయింట్ల పాలసీలో ఈ కొత్త నిబంధన వర్తిస్తుంది. అద్దె చెల్లింపు లావాదేవీలపై రివార్డ్ పాయింట్లను అందించిన ఎస్బీఐ.. ఇకపై రివార్డు పాయింట్లను నిలిపివేయనుంది. ఏప్రిల్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ అమల్లోకి వస్తాయని ఎస్బీఐ కార్డు ప్రకటించింది. ముఖ్యంగా ఎస్బీఐ అందించే (AURUM), కార్డ్ ఎలైట్, సింప్లీ క్లిక్ ఎస్బీఐ కార్డులకు ఈ కొత్త నిబంధన వర్తించనుంది.
ఐసీఐసీఐ బ్యాంక్ :
ఐసీఐసీఐ బ్యాంక్ వెబ్సైట్ ప్రకారం.. ఏప్రిల్ 1, 2024 నుంచి మీరు రూ. 35వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తద్వారా కాంప్లిమెంటరీ ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ని పొందవచ్చు. గత క్యాలెండర్ త్రైమాసికంలో చేసిన ఖర్చులు తదుపరి క్యాలెండర్ త్రైమాసికానికి యాక్సెస్ను అన్లాక్ చేసుకోవచ్చు. ఏప్రిల్-మే-జూన్, 2024 త్రైమాసికంలో కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్కు అర్హత పొందాలంటే.. మీరు జనవరి-ఫిబ్రవరి-మార్చి 2024 త్రైమాసికంలో కనీసం రూ. 35వేలు కార్డు నుంచి ఖర్చు చేయాల్సి ఉంటుంది.
యస్ బ్యాంక్ :
వార్తా నివేదికల ప్రకారం.. యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై నిబంధనలను సవరించింది. ఏప్రిల్ 1 నుంచి క్యాలెండర్ త్రైమాసికంలో రూ. 10వేలు లేదా అంతకంటే ఎక్కువ ఖర్చు చేసే యశ్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్లపై కాంప్లిమెంటరీ డొమెస్టిక్ లాంజ్ యాక్సెస్కు అర్హత పొందవచ్చు. గత త్రైమాసికంలో కనీసం రూ. 10వేలు లేదా ఆపై ఖర్చు చేసిన కార్డులపై తదుపరి త్రైమాసికానికి వర్తిస్తుంది.
యాక్సిస్ బ్యాంక్ :
యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై కూడా ఏప్రిల్ 1 నుంచి కొత్త రూల్స్ వర్తించనున్నాయి. ముఖ్యంగా మాగ్నస్ రివార్డ్ పాయింట్లు, లాంజ్ యాక్సెస్, వార్షిక రుసుములపై నిబంధనలు వర్తిస్తాయి. ఇన్సూరెన్స్, గోల్డ్/ఆభరణాలు, ఇంధనంపై చేసే ఖర్చులపై ఎలాంటి రివార్డ్ పాయింట్లు పొందలేరు. ఎయిర్పోర్ట్ లాంజ్ యాక్సెస్ కోసం గత 3 నెలల్లో కనీసం రూ.50వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.
క్యాలెండర్ ఏడాదిలో దేశీయ, అంతర్జాతీయ లాంజ్ల్లో కాంప్లిమెంటరీ గెస్ట్ విజిట్స్ సంఖ్యను ఏడాదికి 8 నుంచి 4కు తగ్గిస్తోంది. ఈ కొత్త నిబంధనలు ఏప్రిల్ 20 నుంచి వర్తిస్తాయని యాక్సిస్ బ్యాంక్ ప్రకటించింది. వచ్చే వార్షికోత్సవ సంవత్సరం నుంచి మాగ్నస్ కస్టమర్లు ఒక్కో కార్డ్ వార్షికోత్సవ సంవత్సరానికి ప్రాధాన్యతా పాస్పై 4 కాంప్లిమెంటరీ గెస్ట్ విజిట్స్ పొందవచ్చు.