Kishan Reddy : ఈసారి వారంతా బీజేపీకే ఓటు వేశారు, తెలంగాణలో కొత్త శక్తిగా నిలుస్తుంది- పోలింగ్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది.

Kishan Reddy : లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ కొత్త శక్తిగా మారుతుందని చెప్పారాయన. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు ఓటు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని కిషన్ రెడ్డి వెల్లడించారు. యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చిందన్నారు కిషన్ రెడ్డి.

”2019 పార్లమెంటు ఎన్నికల్లో 62.7శాతం పోలింగ్ నమోదైంది. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ 65 శాతం దాటుతుందని తెలుస్తుంది. అన్ని నియోజకవర్గాల్లో బీజేపీకి ప్రజల నుంచి సానుకూల స్పందన వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పార్టీలకు అతీతంగా.. మోదీకి అండగా నిలిచారు. 2023 ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారు. యువకులు, మహిళలు ఏకమై బీజేపీని ఆదరించారు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని మాకు సమాచారం వచ్చింది. ఓటింగ్ తగ్గటానికి చాలా కారణాలున్నాయి. చాలామంది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు వెళ్లడం, తదితర కారణాలతో ఓటింగ్ తగ్గిందని తెలుస్తోంది.

ఈ ప్రక్రియ ప్రశాంతంగా ముగియడంలో సహకరించిన అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ కుటిల యత్నాలను ప్రజలు పట్టించుకోలేదు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ కార్యకర్తలే వారి మాటలను సీరియస్ గా తీసుకోలేదు. పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం తగ్గినా బీజేపీకి అనుకూలంగా ఉందని భావిస్తున్నాను. మేము ముందుగా చెప్పినట్లుగా.. ఈ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు రానున్నాయి. మా పార్టీ అభ్యర్థులపై తీవ్ర స్థాయిలో దుష్ప్రచారం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల కార్యకర్తలు.. వారి నాయకుల మాటలను పట్టించుకో లేదు. బీజేపీ కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు.

ఎన్నికలకు ముందు బండి సంజయ్ నేతృత్వంలో వివిధ యాత్రలు చేశాం. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికలు, అనంతరం పార్లమెంటు ఎన్నికలకు శ్రమించిన కార్యకర్తలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ఇవాళ జరిగిన పోలింగ్‌తో బీజేపీ తెలంగాణలో కొత్త శక్తిగా నిలుస్తుందనడంలో సందేహం లేదు. కేంద్ర పార్టీ అనేక రకాలుగా మాకు సహకరించింది. తెలంగాణ అభివృద్ధికి నడ్డా నాయకత్వంలో సంపూర్ణ సహకారం లభించింది.

తెలంగాణ విమోచన దినోత్సవాలను ప్రతి ఏటా అధికారికంగా నిర్వహించేందుకు కూడా కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సమ్మక్క, సారక్క యూనివర్సిటీ, పసుపు బోర్డు, టెక్స్‌టైల్ బోర్డు వంటి ఎన్నో ప్రతిష్టాత్మక కార్యక్రమాలను మోదీ తెలంగాణకు ఇచ్చారు. త్వరలోనే వీటిని మోదీ చేతుల మీదుగా ప్రారంభించుకోబోతున్నాం. సమ్మక్క సారక్క యూనివర్సిటీ తాత్కాలిక క్యాంపస్ లో ఈ ఏడాది నుంచే క్లాసులు ప్రారంభించుకోబోతున్నాం. చిన్న చిన్న భూ సమస్యలున్నాయి. వాటిని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరిస్తే.. శాశ్వత క్యాంపస్ నిర్మాణం ప్రారంభించుకుంటాం.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారు. ప్రతిదానికి మోదీ ని చాలెంజ్ చేస్తున్నారు. వాళ్ల నాయకుడికే స్థిరత్వం లేదు. వాళ్లు మమ్మల్ని ప్రశ్నించడం హాస్యాస్పదం. ఎవరైనా తమ స్థాయిని చూసుకుని సవాల్ విసిరితే బాగుంటుంది. ఎవరేందనేది జూన్ 4న తెలిసిపోతుంది. డబ్బు ఖర్చుపెడితే, దుష్ప్రచారం చేస్తే.. ప్రజలు హర్షించరు. మాటలు మేము కూడా మాట్లాడొచ్చు. కానీ మాకు కొన్ని పద్దతులున్నాయి. అబద్ధాలు మాట్లాడే అవసరం మాకు లేదు. ముందు గ్యారెంటీలను అమలు చేయమని చెప్పండి.

ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబాద్ లో బీజేపీ విజయం సాధిస్తుంది. అందులో అనుమానం లేదు. అర్బన్ ఏరియాలో ఓటర్ లిస్టుకు సంబంధించిన సంస్కరణలు జరగాలి. ఓటర్ లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలి. చనిపోయిన ఓటర్ల పేర్లు ఇచ్చినా తొలగించ లేదు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో వేల ఓట్లను తొలగించారు. వేల ఓట్లను డిలీట్ అని పేర్కొన్న జాబితాను నిన్న రాత్రే మాకు ఇచ్చారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగింది. ఆధార్ కార్డుతో అనుసంధానం చేస్తే బాగుండేది. మా ఇంట్లో నా ఓటు ఒక దగ్గర, మా బాబు ఓటు మరో దగ్గర ఉంది. రానున్న రోజుల్లో దీనిపై ఆలోచన చేసి చాలా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది.

ఈ పండుగను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని మోదీ చెప్పారని మాత్రమే చెప్పాను. మోదీ పేరును నిషేధించారా? రేవంత్ రెడ్డి.. మిడిమిడి జ్ఞానంతో మాట్లాడారు. ఈ స్థాయికి కాంగ్రెస్ పార్టీ దిగజారింది. రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహించినన్ని రోజులు బీజేపీకి డోకా లేదు. కాంగ్రెస్ పార్టీ కోసం మజ్లిస్ కార్యకర్తలు పని చేశారు” అని కిషన్ రెడ్డి ఆరోపించారు.

Also Read : ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం.. కేసీఆర్‌ను కేఏ పాల్‌తో పోల్చిన సీఎం రేవంత్

ట్రెండింగ్ వార్తలు