Bisleri International : బిస్లెరీ ఇంటర్నేషనల్ ను విక్రయించడానికి ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్ (82).. టాటా కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్తో చర్చలు జరుపుతున్నారు. బిస్లెరీ ఇంటర్నేషనల్ సంస్థ బిస్లెరీ మినరల్ వాటర్, హిమాలయన్ స్ప్రింగ్ వాటర్, హ్యాండ్ ప్యూరిఫయర్ వంటివాటిని కూడా ఉత్పత్తి చేస్తుంది. బిస్లెరీ సంస్థను ఇన్నాళ్లు సమర్థంగా నడిపించారు రమేశ్ చౌహాన్.
ప్యాకేజ్డ్ వాటర్ అనగానే మొదట మనకు బిస్లెరీనే గుర్తుకువస్తుంది. అయితే, రమేశ్ చౌహాన్ కుమార్తె జయంతి బిస్లెరీ వ్యాపార నిర్వహణపై అంతగా ఆసక్తి చూపడం లేదట. దీంతో బిస్లెరీని అమ్మకానికి పెట్టారు. రమేశ్ చౌహాన్ తమ సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారాన్ని 30 ఏళ్ల క్రితం కోకా-కోలాకు అమ్మేశారు. అప్పటి నుంచి థమ్సప్ తో పాటు గోల్డ్ స్పాట్, సిట్రా, మాజా, లిమ్ కా వంటి బ్రాండ్లు కోకా-కోలా చేతుల్లోకి వెళ్లాయి. ఎనిమిది ఏళ్ల క్రితం బిస్లెరీ ద్వారానే మళ్ళీ రమేశ్ చౌహాన్ సాఫ్ట్ డ్రింక్స్ వ్యాపారాన్ని ప్రారంభించినప్పటికీ అది అంతగా కలిసిరాలేదు.
తన కూతురికి బిస్లెరీ సంస్థ నిర్వహణ బాధ్యతల్లో ఉండడం ఇష్టం లేకపోవడంతో ఆ సంస్థను దాదాపు రూ.6,000-7,000 కోట్ల మధ్య ఒప్పందానికి రమేశ్ చౌహాన్ విక్రయిస్తున్నారు. రమేశ్ చౌహాన్ కుమార్తె జయంతి ఫ్యాషన్ డిజైనర్గా రాణిస్తున్నారు. ఆమెకు వ్యాపారాలపై ఆసక్తి లేదు. దీంతో ఆమెకు బలవంతంగా బిస్లెరీ వ్యాపారాన్ని అప్పజెప్పకూడదని భావిస్తున్నారు రమేశ్ చౌహాన్.
బిస్లెరీని కొనేందుకు టాటా కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్తో పాటు రిలయన్స్ రిటైల్, నెస్లే, డానోన్ వంటి సంస్థలూ ఆసక్తి చూపుతున్నాయి. బిస్లరీ సంస్థలో తాను మైనార్టీ వాటాను కూడా ఉంచుకోనని రమేశ్ చౌహాన్ అంటున్నారు. తాను వ్యాపారం నుంచి బయటకు వచ్చాక పర్యావరణ, స్వచ్ఛంద సేవా కార్యక్రమాలపై దృష్టి పెడతానని రమేశ్ చౌహాన్ చెప్పారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..